4×400 రిలేలో స్వర్ణం.. తెలంగాణ కీర్తిని చాటిన ప్రవళిక: సీఎం రేవంత్ విషెస్

by Ramesh Naini |

చైనాలోని ఒర్డోస్‌లో జరుగుతున్న తొలి ఏషియా అండర్ 23 అథ్లెటిక్ చాంపియన్‌షిప్ 2026లో మహిళల 4x400 రిలే పరుగుపందెంలో స్వర్ణ పతకం సాధించిన నారిమళ్ల ప్రవళికకు సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు.

4×400 రిలేలో స్వర్ణం.. తెలంగాణ కీర్తిని చాటిన ప్రవళిక: సీఎం రేవంత్ విషెస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: చైనాలోని ఒర్డోస్‌లో జరుగుతున్న తొలి ఏషియా అండర్ 23 అథ్లెటిక్ చాంపియన్‌షిప్ 2026లో మహిళల 4x400 రిలే పరుగుపందెంలో స్వర్ణ పతకం సాధించిన నారిమళ్ల ప్రవళికకు సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ బిడ్డ ప్రవళిక నారిమళ్ల ఆసియా అండర్ 23 అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్స్‌లో అసమాన ప్రతిభ కనబరిచి మహిళల 4x400 మీటర్ల రిలేలో ఆమె స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. నల్గొండలోని ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీలో చదువుతూ, డిండి గురుకుల స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొంది అంతర్జాతీయ వేదికపై రాణించిన ప్రవళిక యువ క్రీడాకారులు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారని ప్రశంసించారు.

తాపీ మేస్త్రి కూతురైన ప్రవళిక పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారని పేర్కొన్నారు. జట్టులో ప్రవళిక, శ్రావణి సచిన్ సాంగ్లే, సాంద్రమోల్ సాబు, నోఫిసా ఖతూన్‌లతో కలిసి స్వర్ణ పతకం సాధించారు. ఈ నలుగురు సభ్యుల బృందం 3:33.62 సెకన్ల సమయంతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుని, ఆతిథ్య దేశమైన చైనాను అధిగమించింది. అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడానికి ముందే, ప్రవళిక వివిధ వేదికల్లో 23 స్వర్ణాలతో సహా మొత్తం 35 రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించి అద్భుతమైన దేశీయ రికార్డును నెలకొల్పారు. ఈ చాంపియన్‌షిప్‌లో మొత్తంగా 3 స్వర్ణ, 4 రజత, 9 కాంస్య పతకాలతో సహా 16 పతకాలను సాధించిన భారత క్రీడాకారులు అందరికీ ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.

Next Story