కేసీఆర్ కొత్త శకానికి నాంది పలికారు.. ప్రకాశ్ అంబేద్కర్ ప్రశంసలు

by Disha Web Desk 2 |
కేసీఆర్ కొత్త శకానికి నాంది పలికారు.. ప్రకాశ్ అంబేద్కర్ ప్రశంసలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైద‌రాబాద్ న‌గ‌రం న‌డిబొడ్డున హుస్సేన్ సాగ‌ర్ తీరాన 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన భార‌త రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రకాశ్ అంబేద్కర్‌తో క‌లిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా అంబేద్కర్ విగ్రహంపై హెలికాప్టర్ ద్వారా గులాబీ పూల వ‌ర్షం కురిపించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రకాశ్ అంబేద్కర్ మాట్లాడారు. దేశంలోనే అత్యంత భారీ విగ్రహం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌‌కు ధన్యవాదాలు చెప్పారు. అంబేద్కర్ కలలుగన్న ఆశయాలు సాధించినప్పుడే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అని వ్యాఖ్యానించారు. సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు అంబేద్కర్ భావాజాలం అవసరమని అభిప్రాయపడ్డారు.

రూపాయి సమస్యపై 1923లోనే అంబేద్కర్ పరిశోధన పత్రం రాశారని గుర్తుచేశారు. తెలంగాణలో దళితుల అభివృద్ధికి తీసుకొచ్చిన దళిబంధు పథకం ఎంతో గొప్పదని కొనియాడారు. నిమ్న వర్గాల ఉన్నతి కోసమే అంబేద్కర్ పరితపించారని అన్నారు. అలాంటి మార్గాన్నే ఇవాళ దేశంలో కేసీఆర్ ఎంచుకున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణతో కేసీఆర్ కొత్త శకానికి నాంది పలికారని తెలిపారు. పొట్టి శ్రీరాములు బలిదానంతో అంబేద్కర్ చలించిపోయారని, అందుకే రాష్ట్రాల ఏర్పాటు కోసం స్పష్టమైన విధానాన్ని రూపొందించారని అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడిందని అన్నారు. సుదీర్ఘ పోరాటం తర్వాత సాధించిన తెలంగాణను కేసీఆర్ అభివృద్ధి వైపు విజయవంతంగా నడిపిస్తున్నారని ప్రశంసించారు. అంతేగాకుండా.. దేశ ఆర్థిక వ్యవస్థను బలపర్చేందుకు కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, ఆయనతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ముందుకు రావాలని సూచించారు.

Read more:

అంబేద్కర్ పేరు మీద రూ.51 కోట్లతో శాశ్వత నిధి ఏర్పాటు.. సీఎం కేసీఆర్

Next Story

Most Viewed