ఎంపీ అర్వింద్‌కు వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు

by Disha Web Desk 4 |
ఎంపీ అర్వింద్‌కు వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : పార్లమెంట్ ఎన్నికల సమయంలో అయిదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని వాగ్దానం చేసి ఎంపీ అర్వింద్ బాండ్ పేపర్ రాసిచ్చిన విషయం తెలిసిందే. పసుపు బోర్డు నిజామాబాదులో ఏర్పాటు చేయకపోవడంతో కేంద్ర ప్రభుత్వంపై నిజామాబాద్ రైతులు కన్నెర్రజేశారు. పసుపు బోర్డును ఏర్పాటు చేసే ప్రతిపాదన లేదని కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ పార్లమెంటులో ప్రకటించిన విషయం విదితమే. ఈ ప్రకటనతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పార్లమెంటు వేదికగా మోసం మరోసారి బట్టబయలైందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అందుకు నిరసనగా స్థానిక బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ నిర్వాకాన్ని ఎండగడుతూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా “పసుపు బోర్డు... ఇది మా ఎంపీ గారు తెచ్చిన పసుపు బోర్డు” అని పేర్కొని ఉన్న పసుపు రంగు ఫ్లెక్సీలు శుక్రవారం తెల్లవారుజామున పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో అన్ని ప్రాంతాల్లో వెలిసాయి. 2019 పార్లమెంటు ఎన్నికల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్న అర్వింద్ తమను మోసం చేశారని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాండ్ పేపరు రాసిచ్చినా ఇప్పటికీ పసుపు బోర్డును సాధించకపోవడమే కాకుండా బోర్డును ఏర్పాటు చేయలేమని కేంద్రం చెప్పినా ఏమీ పట్టనట్టు ఉండడం పట్ల రైతులు విస్మయం చెందుతున్నారు.

పసుపు బోర్డు తీసుకురాకపోతే రాజీనామా చేస్తానని అర్వింద్ ఎన్నికల సమయంలో తెలిపారని, మరి నాలుగున్నరేళ్లు గడిచినా బోర్డు సాధించలేకపోతే ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ అగ్రనేతలు రాజ్ నాథ్ సింగ్, రామ్ మాధవ్ వంటి వారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీని గెలిపిస్తే 5 రోజుల్లో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని మోసపూరిత హామీ ఇచ్చారని స్పష్టం చేస్తున్నారు. కేంద్రాన్ని ఒప్పించలేని బీజేపీ నాయకులు ప్రజల్లో తిరిగే నైతిక హక్కు లేదని అంటున్నారు. పసుపు బోర్డు ఫ్లెక్సీల ఏర్పాటు వెనుక అధికార పార్టీ నేతలు అండదండలు ఉన్నాయని చెబుతున్నారు.

Next Story

Most Viewed