3 కిలోమీటర్లకో పదవి.. సీఎం టూర్‌లో చిత్ర విచిత్రాలు!

by Disha Web Desk 4 |
3 కిలోమీటర్లకో పదవి.. సీఎం టూర్‌లో చిత్ర విచిత్రాలు!
X

దిశ, కరీంనగర్ బ్యూరో : సాధారణంగా తమకు నచ్చిన వారికి పదవుల పందేరం చేస్తుంటారని వింటుంటాం. అస్మదీయుల కోసం ఎంతటి సాహసానికైనా దిగుతారనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ మాత్రం ఒకే మనిషికి రెండేసి పదవులు పంచారు. ఇదేదో వారిని కూర్చీలో కూర్చోబెట్టేందుకు మాత్రం కాదండి. కేవలం ముఖ్యమంత్రి పర్యటనకు హాజరయ్యందుకు అప్పటికప్పుడు క్రియేట్ చేసిన పదవులు. రికార్డులతో సంబంధం లేకుండా వాస్తవాలతో పొంతన లేకుండా సంబంధం లేని వ్యక్తులకు పదవుల్లో ఉన్నట్టు జాబితా క్రియేట్ చేసి సీఎం పర్యటనను కానిచ్చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ టూర్ తరువాత నెట్టింట వైరల్ అయిన ఓ జాబితాలో పేర్కొన్న పదవులు తప్పుల తడకగా ఉన్నాయని 'దిశ' ప్రచురించిన తరువాత ముఖ్యమంత్రి టూర్‌లో అటెండయ్యే లీడర్ల కోసం ఇష్టారీతిన పదవులను పంచేశారంటూ ఏకంగా జాబితాలను పంపించి మరీ వాస్తవాలు ఏం జరిగాయో వివరించారు కొంతమంది. వీటన్నింటిపై లోతుగా ఆరా తీస్తే విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తుండడం గమనార్హం.

ముఖ్యమంత్రి కేసీఆర్ హెలీక్యాప్టర్‌లో దిగేప్పుడు స్వాగతం పలికేవారి జాబితాలో పేర్కొన్న నాయకుడు ఓ పదవిలో ఉంటే అదే నాయకుడు కొండగట్టు సన్నిధికి చేరుకున్న తరువాత మరో పదవిలో ఉన్నట్టుగా రాయడం విచిత్రం. చిత్ర విచిత్రంగా తయారు చేసిన ఈ జాబితాలోని డొల్లతనం బయటపడడంతో సాక్షాత్తు సీఎం టూర్లోనే ఇలా ఎలా వ్యవహరించారన్న చర్చ మొదలైంది. జాబితా తయారీలో అటు సీఎంఓ, ఇటు సీఎం సెక్యూరిటీ అధికారులను మిస్ గైడ్ చేసే విధంగా వ్యవహరించారా అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

జాబితా ఇలా...

ముఖ్యమంత్రి హెలీప్యాడ్‌కు చేరుకున్నప్పుడు స్వాగతం చెప్పే జాబితాలో ఏనుగు రవీందర్ రెడ్డి అనే నాయకుడు కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ హోదాలో పేర్కొన్నారు. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండగట్టు అంజన్న ఆలయ ఈఓ కార్యాలయంలో అనుమితించే వారి జాబితాలోనూ ఈయన పేరును చేర్చారు. ఇక్కడ మాత్రం ఏనుగు రవీందర్ రెడ్డి పీఏసీఎస్ మల్యాల అని మాత్రం రాశారు.

మిట్టపల్లి సుదర్శన్‌ను మల్యాల సర్పంచ్‌గా ఓ జాబితాలో, ఈఓ ఆఫీసు వరకు అనుమతించే వారి జాబితాలో కొండగట్టు ఆలయ డైరక్టర్ అని పేర్కొన్నారు. పునుగోటి కృష్ణారావు హిమ్మత్ రావుపేట సర్పంచ్‌గా ఓ జాబితాలో ఉంటే మరో లిస్ట్‌లో పీఏసీఎస్ కొడిమ్యాల అని రాయించారు. ఇలా జాబితాను తయారు చేసి ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లోకి తమ వారిని అనుమతించడం విడ్డూరం.

ఒకే వ్యక్తి పేరు వేర్వేరు పదవుల్లో పేర్కొంటూ జాబితాల తయారు చేయడం వెనక ఆంతర్యం ఏంటోనన్నది బీఆర్ఎస్ వర్గాలకు అంతుచిక్కకపోగా, అధికారులను సైతం విస్మయపరుస్తోంది. చివరి క్షణంలో జాబితాలను జిల్లా యంత్రాంగం చేతిలో పెట్టడం వల్ల వారి గురించి పూర్తిగా ఆరా తీసే పరిస్థితి లేకుండా పోయిందని అంటున్నారు.

అయితే ఎవరు ఏ పదవిలో కొనసాగుతున్నారో క్రాస్ చెక్ చేసుకున్న తరువాత నాయకులను ఆయా ప్రాంతాలకు అనుమతి ఇస్తే బావుండేందన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నవారే ఎక్కువ. అయితే సీఎం టూర్లో కనిపించేందుకు లోకల్ లీడర్స్ కోసం చేసిన ఈ తాపత్రయం వల్ల సెక్యూరిటీ సమస్యలు ఎదురైతే ఎవరికి నష్టం వాటిల్లేదోనన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది.



Next Story

Most Viewed