బిగ్ బ్రేకింగ్: బీజేపీలో చేరిన ప్రముఖ నటి జయసుధ

by Disha Web Desk 19 |
బిగ్ బ్రేకింగ్: బీజేపీలో చేరిన ప్రముఖ నటి జయసుధ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ లీడర్ షిప్‌తోనే భారత్ అభివృద్ధి చెందిందని.. అందకుకే బీజేపీలో చేరానని సికింద్రాబాద్‌ మాజీ ఎమ్మెల్యే, సినీ నటి జయసుధ పేర్కొన్నారు. మతం, కులం పరంగా కాకుండా ప్రజలకు మంచి సర్వీస్ చేయాలని, క్రైస్తవులను రిప్రజెంట్ చేస్తానని, మార్పు కోసమే బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఇవాళ జయసుధ బీజేపీలో అధికారికంగా చేరారు. ఢిల్లీలోని జాతీయ కార్యాలయంలో బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ చుగ్‌ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రాథమిక సభ్యత్వం అందించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి, డీకే ఆరుణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయసుధ మీడియాతో మాట్లాడుతూ.. తాను బీజేపీలో చేరుతున్నానంటే చాలామంది ఆశ్చర్య పోయారన్నారు. దాదాపు సంవత్సరం నుంచి బీజేపీ నేతలతో తాను మాట్లాడుతున్నట్లు చెప్పారు. సినిమా ఇండస్ట్రీలో అభిమానులంతా మద్దతు ఇస్తారన్న నమ్మకం ఉందన్నారు. ఇంతకాలం తను రాజకీయాల్లో కనిపించకపోవడానికి చాలా కారణాలున్నాయన్నారు. టైమ్ వచ్చినప్పుడు వివరాలను చెప్తానని తెలిపారు. సినిమాల్లో అవకాశాలను తగ్గించుకుంటారని, మంచి సినిమాల్లో మాత్రమే యాక్ట్ చేయాలనుకుంటున్నట్లు ప్రకటించారు.

బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ చుగ్‌ మాట్లాడుతూ.. జయసుధకు సినిమా ఇండస్ట్రీలో మంచి పేరుందన్నారు. 9 ఏళ్లలో ప్రధాని మోడీ చేసిన అభివృద్ధిని చూసి జయసుధ బీజేపీలో చేరారని చెప్పారు. జయసుధ చేరిక బీజేపీకి ఉత్సాహాన్ని ఇస్తుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. పేదల సంక్షేమం, బస్తీల అభివృద్ధిపై జయసుధకు చిత్తశుద్ధి ఉందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలంటే కుటుంబ పాలన, నియంతృత్వ పాలన పోవాలి అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. జయసుధతో పాటు పలువురు బీజేపీ కండువా కప్పుకున్నారు.

Next Story