BREAKING: తెలంగాణలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

by Disha Web Desk 19 |
BREAKING: తెలంగాణలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలతో ముగిసినట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రక్రియ అంతా ప్రశాంతంగా సాగింది. మొత్తం 119 నియోజకవర్గాలకు గాను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసిపోగా మిగతా 106 స్థానాల్లో 5 గంటలతో పోలింగ్ ముగిసింది. అయితే 5 గంటలలోపు క్యూలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. పలు చోట్ల చివరి గంటలో ఓటు వేసేందుకు ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు. పోలింగ్ పూర్తి స్థాయిలో ముగిశాక ఇవాళ రాత్రికి ఈవీఎం లను స్ట్రాంగ్ రూమ్‌లకు సిబ్బంది తరలించనున్నారు.

ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తం:

119 నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న 2,290 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 3.26 కోట్ల మంది ఓటర్లు ఈవీఎం మిషన్లలలో నిక్షిప్తం చేశారు. గతంతో పోలిస్తే ఈసారి ప్రధాన పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయం సాగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ అగ్రనేతలు తెలంగాణలో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. గ్రామీణ ప్రాంత ఓటర్లు ఓటు హక్కును పెద్ద సంఖ్యలో వినియోగించుకోగా పట్టణ ప్రాంతాల్లో మాత్రం మందకొడిగా పోలింగ్ సాగింది. దీంతో ప్రజల నిర్ణయం ఏంటి అనేది ఆసక్తిగా మారింది. మరోసారి అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ ఓట్లు అడగగా.. ఈసారి మార్పు తేవాలని ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్లాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరి వైపు నిలబడ్డారో అనేది డిసెంబర్ 3న చేపట్టే కౌంటింగ్‌లో తేలనుంది.

Next Story

Most Viewed