పైరవీలే ప్రామాణికం.. పోలీసు శాఖలో మరీ దారుణం..?

by Disha Web Desk 12 |
పైరవీలే ప్రామాణికం.. పోలీసు శాఖలో మరీ దారుణం..?
X

దిశ, నిఘా బ్యూరో: వాస్తవానికి రాజకీయ పరిస్థితులు గతంలో లాగా లేవు. పూర్తిగా మారిపోయాయి. దానికి తోడు లీడర్లు, ప్రజాప్రతినిధుల వ్యవహార శైలి మారింది. తాము చెప్పినట్టు వినే అధికారి ఉంటే.. అభివృద్ధి పనులు త్వరగా జరుగుతాయనో.. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించగలుగుతామనే ఉద్దేశంతో మొదట్లో అధికారులను పైరవీల ద్వారా నియమించుకునేటోళ్లు. కానీ అదికాస్త.. ప్రజాప్రతినిధులు పైరవీ లెటర్ ఇస్తే తప్ప పోస్టింగ్ దక్కించుకునే పరిస్థితి లేకుండా పోయింది.

దీనికితోడు వర్గపోరు ఉన్న నియోజకవర్గాల్లో, ప్రతిపక్ష పార్టీలు బలంగా ఉన్న ప్రాంతాల్లోనూ అధికార పార్టీ లీడర్లు, ప్రజాప్రతినిధులు తాము లెటర్ ఇస్తేనే పోస్టింగ్ ఇచ్చేలా ఉన్నతాధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ప్రజాప్రతినిధులను కాదని ఎవరూ పోస్టింగ్ తెచ్చుకున్నా.. పట్టుమని 10 రోజులు ఉద్యోగం చేయలేని పరిస్థితి ఉందంటే ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఆంధ్రా అధికారులకే పెద్దపీట..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన పోలీసు అధికారులకే పెద్దపీట వేస్తుండడం గమనార్మం. ఇదే క్రమంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రా పోలీసు అధికారులకు ప్రాధాన్యత గల పోస్టింగులే దక్కడంతో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు లూప్ లైన్లలో పని చేయాల్సి వస్తుందని మదనపడుతున్నారు. గతంలో సోషల్ మీడియాలో సైతం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆంధ్రా ప్రాంతపు ఎస్ఐ, సీఐలకు పెద్దపీట వేశారంటూ వైరల్ అయ్యింది.

ఈ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ ఆరా తీసినా.. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మాత్రం ఆంధ్రా అధికారులకు పైరవీ లెటర్ల ఇవ్వడం.. పోస్టింగ్‌లు దక్కడం చకచకా జరిగిపోతున్నాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ సీఐ స్థాయి అధికారి నిక్కచ్చిగా వ్యవహరించడం వల్ల ఓ ఎమ్మెల్యేకు, సదరు సీఐకి చెడింది. దీంతో దాదాపు నాలుగేండ్లుగా సదరు సీఐ అధికారికి ప్రయారిటీ పోస్టు లేకపోవడంతో ఉమ్మడి జిల్లా పరిధిలోనే పనిచేస్తున్నారు. ఇదిలావుంటే.. గతంలో తమకు అనుకూలంగా వ్యవహరించలేదనే అక్కసుతో నేటికీ సదరు పోలీసు అధికారికి జిల్లాలో పోస్టింగ్ రాకుండా చేశారంటే పరిస్థితి ఎలా ఉందో తెలిసిపోతుంది.

పోలీసు, రెవెన్యూ శాఖల్లో మరీ దారుణం..

పోలీసు, రెవెన్యూ శాఖల్లో పైరవీల వ్యవహారం ప్రధానంగా మారిపోయింది. మారుమూల మండలంలో ఎస్ఐ పోస్టింగ్ తెచ్చుకోవాలన్నా.. తహసీల్దార్‌గా పనిచేయాలన్నా.. సదరు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే పైరవీ లెటర్ తప్పనిసరి అయ్యింది. ఇదే అదునుగా డిమాండ్ ఉన్న మండలాల్లో ఎస్ఐ పోస్టింగ్ కోసం లెటర్ ఇయ్యాలంటే.. క్యాస్ట్ ఇక్వేషన్‌తో పాటు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అమ్యామ్యాలు ముట్టజెప్పుతున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమైపోతుంది.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ఓ తహసీల్దార్.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాటి నుంచి అటు ఇటు తిరిగి అదే నియోజకవర్గంలో పోస్టింగ్‌లు తెచ్చుకుంటుండడం గమనార్హం. రెవెన్యూ పరంగా విపరీతంగా లావాదేవీలు ఉండే నియోజకవర్గం కావడం సదరు అధికారికి.. ప్రజాప్రతినిధికి కలిసొస్తుండడం కొసమెరుపు.

హానెస్ట్ ఆఫీసర్ల కుంగుబాటు..

ప్రస్తుత రాజకీయ నాయకుల తీరు.. పోస్టింగ్‌ల వ్యవహారంతో హానెస్ట్ ఆఫీసర్లు కుంగుబాటుకు గురవుతున్నారు. పొద్దస్తమానం ఆఫీస్ వ్యవహారాలే లోకంగా బతికే అధికారులకు తగిన గుర్తింపు దక్కకపోవడం.. ప్రమోషన్, మంచి ఏరియాలో పోస్టింగ్ రావాలంటే.. రూ.లక్షలు ముట్ట చెప్పాల్సి వస్తుండడంపై తీవ్ర మనోవేదన చెందుతున్నారు. ప్రధానంగా 90బ్యాచ్ అధికారులు ప్రస్తుత పరిణామాల పై జాబ్ చేయడం కంటే.. మానేసి వీఆర్ఎస్ తీసుకోవడం ఉత్తమమని చెబుతుండడం గమనార్హం.

దీనికితోడు గతంలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు.. అధికారులను గౌరవంగా పిలవడం తో పాటు తగిన వ్యాల్యూ ఇచ్చేవారని, ప్రస్తుత ఎమ్మెల్యేలు ప్రజల మధ్యలోనూ బూతు పురాణం అందుకుంటున్నారని మనోవేదన పడుతున్న అధికారులు లేకపోలేదు. ఎంత నిజాయతీగా పనిచేసిన లూప్‌లైన్ పోస్టులకే పరిమితం చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు.

Next Story