త్వరలోనే కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం: పిడమర్తి రవి ఫైర్

by Disha Web Desk 19 |
త్వరలోనే కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం: పిడమర్తి రవి ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2న నిర్వహించే దశాబ్ది ఉత్సవాలను బహిష్కరిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ప్రకటించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణంలో పలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా పిడమర్తి రవి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. తెలంగాణ విద్యార్థి అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబ దోపిడీకి గురై అప్పుల రాష్ట్రంగా మిగిలిందన్నారు. కేసిఆర్ దగా పడ్డ తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలను నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని, త్వరలోనే ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని హెచ్చరించారు. అన్ని విద్యార్థి సంఘాలు ఏకతాటి పైకి వచ్చి దశాబ్ది ఉత్సవాలను బహిష్కరిస్తున్నట్లు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.

ఓయూ విద్యార్థి జేఏసీ చైర్మన్ మిడతనపల్లి విజయ్ మాట్లాడుతూ.. బతుకు తెలంగాణ కావాలని ప్రజలు కోరుకుంటుంటే బార్ల తెలంగాణగా మార్చారని, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దశాబ్ది ఉత్సవాలను విరమించుకొని ప్రగతి తెలంగాణ కోసం పాటుపడాలని లేని పక్షంలో జూన్ 2న ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో నల్ల జెండాలతో నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు. పిడమర్తి నాయకత్వంలో త్వరలోనే అన్ని విద్యార్థి సంఘాలను ఏకతాటిపైకి వచ్చి విద్యార్థి గర్జన భారీ బహిరంగ సభ నిర్వహించి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తామని హెచ్చరించారు.


Next Story

Most Viewed