జీవో 252 పై మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతిపత్రం: అల్లం నారాయణ

by Malleboina Mahesh |

ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో 252పై రాష్ట్ర మంత్రులను, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలిసి ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు వినతిపత్రాలు అందజేస్తామని తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్టు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ తెలిపారు.

జీవో 252 పై మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతిపత్రం: అల్లం నారాయణ
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో 252పై రాష్ట్ర మంత్రులను, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలిసి ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు వినతిపత్రాలు అందజేస్తామని తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్టు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ తెలిపారు. ఆదివారం యాదగిరిగుట్ట పట్టణంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీవో నంబర్‌ 252పై ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు తెలిపిన నేపథ్యంలో దశల వారిగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని ఏకగ్రీవంగా కమిటి నిర్ణయిందన్నారు. కొత్త జీవో కారణంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐక్య కార్యాచరణ చేపట్టాలని నిర్ణయిస్తూ, ప్రభుత్వంతో చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం రావాలని, లేనిపక్షంలో పోరాట మార్గాన్ని అనుసరిస్తామన్నారు.

జీవోను సవరించి వరకు అవిశ్రాంత పోరాటం చేస్తామని హెచ్చరించారు. జర్నలిస్టులకు అన్యాయం జరిగే ఇలాంటి జీవో సవరణ చేయడం గానీ, నూతన జీవో తీసుకురావడం గాని ఈ ప్రభుత్వం వెంటనే చేయాలని కోరారు. వచ్చే ఏడాది మార్చి నెలలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలు నిర్వహించి పూర్తి స్థాయి కమిటీ వేనునున్నట్లు తెలిపారు. చిన్న పత్రికల ఎంప్యానల్మెంట్ సమస్య పరిష్కారం కోసం సమాచార శాఖ భవన్ ముట్టడి కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుడతామన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ‘తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌’ ప్రారంభించామని ప్రకటించారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కానీ మారుతి సాగర్‌ మాట్లాడుతూ జీవో 252ను స్పష్టత లేకుండా జర్నలిస్టు యూనియన్లతో సంప్రదింపులు జరపకుండా విడుదల చేశారని ఆరోపించారు.

గతంలో జీవో 239 రూపకల్పన సమయంలో నిపుణుల కమిటీ సూచనల మేరకు డెస్క్‌ జర్నలిస్టులకు అక్రిడేషన్‌ కార్డులు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తాజా జీవో 252లో ఆ స్ఫూర్తి పూర్తిగా లోపించిందన్నారు. ప్రస్తుత నిబంధనల కారణంగా సుమారు 13 వేల అక్రిడేషన్‌ కార్డులు రద్దయ్యే పరిస్థితి ఏర్పడుతోందని, ఇది జర్నలిస్టుల వృత్తి భద్రత, జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ఈసమావేశంలో రమేష్‌ హాజారీ, యోగానంద్, రాష్ట్ర టెంజు అధ్యక్షుడు విష్ణువర్ధన్‌ రెడ్డి, కార్యదర్శి రమణతో పాటు అన్ని జిల్లాల అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు, జర్నలిస్టులు హాజరయ్యారు.

Next Story