చెల్లెలి 'సెంటిమెంట్'.. కలసి వస్తుందని తెలంగాణ కాంగ్రెస్‌లో ఆశ!

by Disha Web Desk 2 |
చెల్లెలి సెంటిమెంట్.. కలసి వస్తుందని తెలంగాణ కాంగ్రెస్‌లో ఆశ!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్​పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 'హాథ్ సే హాథ్ జోడో అభియాన్' పాదయాత్ర సోమవారం నుంచి షురూ కానున్నది. అయితే ఈ యాత్రతో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా దృష్టి పెట్టింది. చెల్లెలి సెంటిమెంట్​కూడా తమకు కలసి వస్తుందనే అభిప్రాయంలో రేవంత్​వర్గం ఉన్నది. గతంలో వైఎస్​రాజశేఖర్​రెడ్డి తాను చెల్లెగా భావించిన సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గం చెవేళ్ల నుంచి పాదయాత్ర చేయగా, ఇప్పుడు రేవంత్ సోదరిగా భావిస్తున్న ఎమ్మెల్యే సీతక్క ప్రాతినిత్యం వహిస్తున్న ములుగు నుంచి పాదయాత్రను మొదలు పెట్టనున్నారు. ఇది కాంగ్రెస్‌కు కలసి వస్తుందనే ఆశలు నేతల్లో ఉన్నది. ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఏఐసీసీ ముందు ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. దీంతోనే తొలుత వివిధ ప్రాంతాల్లో పాదయాత్ర చేపట్టాలని ప్రణాళికలు మొదలు పెట్టినా.. ఎట్టకేలకు సీతక్క అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పాదయాత్రకు కాంగ్రెస్ జాతీయ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం.

కష్టాల కడలిలో ఉన్న కాంగ్రెస్‌ను రక్షించాలని వైఎస్సార్ 2003లో పాదయాత్ర చేయాలని భావించారు. చెల్లె సెంటిమెంట్​ఎక్కువగా ఉన్న వైఎస్, సబిత ఇంద్రారెడ్డి ప్రతినిత్యం వహిస్తున్న చెవేళ్ల నుంచి తన పాదయాత్రను మొదలు పెట్టారు. 60 రోజుల పాటు వివిధ జిల్లాలను టచ్​చేస్తూ 1500 కి.మీ మేరకు పాదయాత్రను చేశారు. ఇది వైస్సార్‌కు క్రెడిట్‌ను తీసుకురావడమే కాకుండా కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి కారణమైందని కాంగ్రెస్​వర్గాల్లో నిత్యం చర్చ జరుగుతూనే ఉన్నది. వైఎస్​సీఎం పీఠం ఎక్కిన తర్వాత సబితా ఇంద్రారెడ్డికి కీలక పదవి ఇవ్వాలని భావించిన వైఎస్, ఆమెకు హోంమంత్రి పదవి ఇచ్చారు. వైఎస్​ఇమేజ్‌తో పార్టీ రెండు దఫాలుగా అధికారంలో నిలిచింది. ఇప్పుడు కూడా పీసీసీ హోదాలో రేవంత్​తాను చెల్లిగా భావించే సీతక్క నియోజకవర్గం నుంచి పాదయాత్రను మొదలు పెట్టాలని భావించారు. ఢిల్లీ పెద్దల వద్ద కూడా పట్టుబట్టి ఒప్పించినట్లు తెలిసింది. ఈ హాథ్ సే హాథ్ జోడో యాత్ర గతంలో వలే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు మేలు చేస్తుందని పార్టీ వర్గాల్లో ఆశ. అదే నిజమైతే సీతక్కకు పార్టీలో కీ రోల్ ఇవ్వొచ్చనే ప్రచారం కూడా ఇప్పట్నుంచే గాంధీభవన్​వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

సాధ్యమేనా...?

గతంలో వైఎస్సార్​పాదయాత్ర చేసే సమయంలో కాంగ్రెస్​పార్టీ నేతలంతా అధికారం కోసం మమేకమై పనిచేశారు. కానీ ఇప్పుడు రేవంత్ నిర్ణయాలు, పాదయాత్రకు కొందరు సీనియర్లు ఇప్పటికీ అడ్డుపడుతూనే ఉన్నారు. పార్టినీ అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని రేవంత్ పలు దఫాలుగా ప్రకటించినా, సీనియర్లకు, రేవంత్ వర్గం మధ్య ఎక్కడో సమన్వయ లోపం వస్తున్నది. దీంతో ప్రతీ సారి కాంగ్రెస్​పార్టీలో అంతర్గత కొట్లాటలు జరుగుతున్నాయి. ప్రస్తుతం హాథ్​సే హాథ్​ యాత్రలోనూ చాలా మంది భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. దీంతో థాక్రే జోక్యంతో రేవంత్ పాదయాత్ర ములుగు నుంచే కొనసాగుతుందని చెబుతూనే, రాష్ట్రంలో ఎక్కడ్నుంచైనా పాదయాత్ర చేసుకోవచ్చని కొందరు సీనియర్లుకు సూచించారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జీలు కూడా స్థానికంగా నిర్వహించుకోవచ్చని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల మధ్య కాంగ్రెస్ పార్టీలోని కొందరు సీనియర్లు, వారి కేడర్​రేవంత్‌కు సహకరిస్తారా? లేదా? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. కానీ సమిష్టిగా పనిచేస్తే పార్టీకి మంచి రోజులు వస్తాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read..

నేటి నుంచే రేవంత్ రెడ్డి పాదయాత్ర.. అక్కడినుంచే ప్రారంభం


Next Story

Most Viewed