రైతులను పట్టించుకోకుండా రాజకీయాలా.. సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

by Disha Web Desk 12 |
రైతులను పట్టించుకోకుండా రాజకీయాలా.. సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: అకాల వర్షంతో రైతాంగం అతలాకుతలం అవుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రాజకీయం చేస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందని అన్నదాతకు అపార నష్టం వాటిల్లిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

పెట్టుబడి వరద పాలు కావడంతో రైతులు రోదిస్తున్నారన్నారు. మామిడి, టమాట, ఉల్లి, మిర్చి, మొక్క జొన్న, పొద్దుతిరుగుడు, శనగా, కూరగాయలు తదితర పంటలకు తీవ్ర నష్టం సంభవించిందన్నారు. పంట నష్టంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల వల్ల సాగు ఖర్చులు భారీగా పెరిగాయని ప్రభుత్వం నుంచి ఎటువంటి చేయూత లేని పరిస్థితుల్లో అకాల వర్షం సృష్టించిన బీభత్సం మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా రైతుల పరిస్థితి మారిందన్నారు.

గతంలో కేంద్ర, రాష్ట్ర బృందాలు పర్యటించి పంట నష్టం చూసేవని కానీ ప్రస్తుతం రాష్ట్రంలో పంటల బీమా పథకం కూడా లేకుండా చేశారని మండిపడ్డారు. తక్షణమే పంట నష్టం అంచనా వేసి ఎకరానికి రూ.15 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాబోయే సీజన్ నుంచి ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని అమలు చేసి తక్షణమే రూ. లక్ష రైతు రుణమాఫీ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed