- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్కు అనుమతి ఇవ్వం! ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ‘నవ నిర్మాణ సభ’ పై రాజకీయంగా చర్చానీయాంశంగా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ‘నవ నిర్మాణ సభ’ పై రాజకీయంగా చర్చానీయాంశంగా మారింది. సభను నిర్వహించేందుకు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ ఈ రోజు సాయంత్రం 4.30 గంటల నుంచి 5.30 గంటల మధ్యలో జూబ్లీహిల్స్ లోని తన నివాసంలోనే ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. అయితే పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ పెట్టడానికి అనుమతి ఇవ్వమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కనీసం మా ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టడానికి అవకాశం ఇవ్వాలని పవన్ అడుగుతున్నారని, అయితే, ఆ ప్రెస్ మీట్కి అవకాశం ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి మేలు చేయడానికి బీజేపీ కుట్ర చేసిందని, అందులో భాగంగానే జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ను ముందుకు తెచ్చిందని ఆయన ఆరోపించారు. పవన్ మీటింగ్పై బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తుంటే సైలెంట్గా ఉంటారా? అని ప్రశ్నించారు.
రాజకీయాల కోసం ఏమైనా చేస్తారా..?
రాజకీయాల కోసం ఏమైనా చేస్తారా..? ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని అద్దంకి దయాకర్ ఆరోపించారు. పవన్ బీజేపీ కోసం పనిచేస్తున్నారని, ఆయన చిచ్చుబుడ్డి వెలిగించాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు. మోడీ వచ్చి వెళ్లాక టార్గెట్ తెలంగాణ అని బీజేపీ చెప్పిందని, రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు వైషమ్యాలు సృష్టించాలని చూస్తారా? అని నిలదీశారు. తెలంగాణ ప్రశాంతంగా ఉండటం ఇష్టం లేదా? అని ప్రశ్నించారు. ఏపీలో మీ పాలన మీరు చేసుకోండని హితువు పలికారు.
రాజకీయాలు చేస్తామంటే ఊరుకుంటారా?
తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలే అని పవన్ అన్నారు.. అలాంటి వ్యక్తి తెలంగాణలో రాజకీయాలు చేస్తామంటే ఊరుకుంటారా? అని నిలదీశారు. మీకు ప్రొఫెసర్ నాగేశ్వర్ రావుకి ఏమి వైరుద్యాలు ఉన్నాయో మాకు తెలియదన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం రెండు రాష్ట్రాల స్నేహం కోరుకుంటుందని తెలిపారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా.. అక్కడ అభివృద్ధి చేసేది తామేనని, స్పెషల్ స్టేటస్ ఇచ్చేది కూడా తామేనని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ పచ్చగా ఉండాలని తెలంగాణ కోరుకుంటుందని అన్నారు.






