ఆంధ్రలో పార్టీ అవసరమే కానీ.. విగ్రహాలు వద్దా?

by Disha Web Desk 4 |
ఆంధ్రలో పార్టీ అవసరమే కానీ.. విగ్రహాలు వద్దా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఏపీలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించేందుకు వ్యూహాలు రచిస్తోన్న సీఎం కేసీఆర్ ఆ ప్రాంతానికి చెందిన ప్రముఖుల విగ్రహాలను తొలగిస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. కొత్తగా నిర్మించిన సెక్రటేరియట్ బయట విశాలమైన పార్కు నిర్మించేందుకు పనులు జరుగుతున్నాయి. ఆ ప్రాంతంలో ఉండే మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, పొట్టి శ్రీరాములు, తెలుగుతల్లి విగ్రహాలను తొలగించారు. వాటిని ఎక్కడికి తరలించారో ఎవరికీ తెలియదు. వాటిని మళ్లీ అక్కడ ఏర్పాటు చేస్తారా? లేదోనని చర్చ జరుగుతోంది.

పార్కు నిర్మాణం కోసం తొలగింపు

ఉమ్మడి రాష్ట్రంలో సెక్రటేరియట్ బయట, లుంబినీ పార్కు ఎదురుగా నీలం సంజీవరెడ్డి, పొట్టి శ్రీరాములు, తెలుగు తల్లి విగ్రహాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆ విగ్రహాల జోలికి ఎవరూ వెళ్లలేదు. కానీ కొత్తగా నిర్మించిన సెక్రటేరియట్‌కు ఎదురుగా పెద్ద పార్కు నిర్మించేందుకు పనులు జరుగుతున్నాయి. ఆ పార్కు నిర్మాణం జరుగుతున్న ప్రాంతం మధ్యలో ఈ మూడు విగ్రహాలు ఉన్నాయి. దీంతో వాటిని తొలగించారు. కానీ ఎక్కడికి తరలించారు? మళ్లీ వాటిని ఎక్కడ ఏర్పాటు చేస్తారా? అనే విషయాలు తమకు తెలియదని పనులు పర్యవేక్షిస్తున్న ఆర్అండ్‌బీ అధికారులు అంటున్నారు.

అందుకే ఫ్లైఓవర్‌కు తెలుగు తల్లి పేరు

చంద్రబాబు హయాంలో ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేడ్కర్ విగ్రహం పక్క నుంచి సెక్రటేరియట్ సమీపంలో ఫ్లైఓవర్ నిర్మించారు. ఈ నిర్మాణంపై అప్పట్లో పెద్ద వివాదం తలెత్తడంతో, పనులు పూర్తవడానికి ఐదారేండ్ల సమయం పట్టింది. చివరికి పనులు పూర్తయ్యాక తెలుగుతల్లి ఫ్లైఓవర్‌గా పేరు పెట్టారు. ఎందుకంటే తెలుగుతల్లి విగ్రహం పక్కన ఉండడంతో ఆ పేరును ఫైనల్ చేశారు.



Next Story

Most Viewed