సర్కార్ మాటలతో మభ్యపెట్టొద్దు.. ఆ ధాన్యాన్ని వెంటనే కొనాలి: పాకాల శ్రీహరిరావు

by Disha Web Desk 19 |
సర్కార్ మాటలతో మభ్యపెట్టొద్దు.. ఆ ధాన్యాన్ని వెంటనే కొనాలి: పాకాల శ్రీహరిరావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: అకాల వర్షాలతో తడిసిన, రంగుమారిన, మొలకెత్తిన ధాన్యంను మద్దతు ధరను కొనుగోలు చేస్తామని ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకుందని, రైతులను మాటలతో మభ్యపెట్టడం మానుకోవాలని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు సూచించారు. ఆదివారం మీడియా ప్రకటన విడుదల చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఇప్పటివరకు మిల్లర్ల నుంచి సంప్రదింపులు జరుపకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తేమశాతం, పొల్లు ఉందని 10 నుంచి 14శాతం మిల్లర్లు తరుగు తీస్తున్నారని ఆరోపించారు.

తరుగు తీయకుండా తడిసిన, తేమశాతం అధికంగా ఉన్నప్పటికీ ప్రకటించిన ఎంఎస్పీ ప్రకారం మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని, పంటనష్ట విస్తీర్ణం పరిగణలో సాంకేతిక కారణాలు చూపి అధికారులు పంటనష్టం తక్కువగాచూపకుండా ఆదేశించాలని, 30 రోజుల్లో పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, రాష్ట్రాన్ని వర్షప్రభావిత రాష్ట్రంగా ప్రకటించి పంట రుణాలను రీ షెడ్యూల్ చేయించి కొత్తరుణాలు మంజూరు చేయించాలని, చేసిన అప్పులు తీర్చుకోవడానికి పంట రుణాలకు అదనంగా మొదటి ప్రాధాన్యతతో దీర్ఘకాలిక రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. తాత్సారం చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు.



Next Story

Most Viewed