పండుగ రద్దీ.. కిక్కిరిసిన ప్రయాణ ప్రాంగణాలు

by Gantepaka Srikanth |

దీపావళి పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ నడిపిస్తున్న ప్రత్యేక రైలు సర్వీసులకు భారీ స్పందన వస్తోంది.

పండుగ రద్దీ.. కిక్కిరిసిన ప్రయాణ ప్రాంగణాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: దీపావళి పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ నడిపిస్తున్న ప్రత్యేక రైలు సర్వీసులకు భారీ స్పందన వస్తోంది. 2025 అక్టోబర్ 18 (శనివారం) నాటికి ఢిల్లీ, ముంబై, సూరత్, ఉధ్నా, సికింద్రాబాద్ వంటి ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి బయలుదేరిన 275 స్పెషల్ ట్రెయిన్ల ద్వారా 10 లక్షలకుపైగా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. రైల్వే అధికారుల వివరాల ప్రకారం.. కేవలం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచే శనివారం సుమారు 1.50 లక్షల మంది ప్రయాణికులు స్పెషల్ ట్రెయిన్లను వినియోగించారు. దీని ద్వారా దేశ రాజధానిలోని రైల్వే టర్మినల్స్‌లో పండుగ రద్దీ తీవ్రత స్పష్టమవుతోంది.

దీపావళి రద్దీని దృష్టిలో ఉంచుకుని, సాధారణ రైళ్లకు అదనంగా నడుపుతున్న ఈ స్పెషల్ సర్వీసులు ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ప్రయాణించే ప్రయాణికులకు అనుకూలంగా ఏర్పాటు చేశారు. అదనపు బోగీలు, తాత్కాలిక రిజర్వేషన్ కౌంటర్లు, భద్రతా సిబ్బందిని అందుబాటులో ఉంచుతూ ప్రత్యేక రైళ్ల ద్వారా సేవలు అందించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. దీపావళి పండుగ రద్దీ రాబోయే వారం రోజుల పాటు కొనసాగుతుందని భావిస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

Next Story