ఉస్మానియాలో అపూర్వ విజయాలు.. చిన్నారులకు ఫ్రీ గా కాస్ట్లీ ట్రీట్మెంట్

by Naga Rani Yarlagadda |

పేద కుటుంబాలకు ఉస్మానియా దవాఖాన వరంగా మారుతోంది. చిన్నారుల ప్రాణాలు కాపాడుతూ వారికి పునర్జన్మను ప్రసాదిస్తోంది.

ఉస్మానియాలో అపూర్వ విజయాలు.. చిన్నారులకు ఫ్రీ గా కాస్ట్లీ ట్రీట్మెంట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పేద కుటుంబాలకు ఉస్మానియా దవాఖాన వరంగా మారుతోంది. చిన్నారుల ప్రాణాలు కాపాడుతూ వారికి పునర్జన్మను ప్రసాదిస్తోంది. ఉస్మానియాలోని యూరాలజీ విభాగం ఏడాదిన్నర కాలంలోనే 109 పీడియాట్రిక్ కిడ్నీ, యూరినరీ ట్రాక్ట్ స్టోన్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించింది. ఆరు నెలల వయస్సు ఉన్న శిశువులకు సైతం శస్ర్తచికిత్సలను సమర్థవంతంగా చేశారు. ఇవే సర్జరీల కోసం ప్రైవేటు ఆస్పత్రుల్లోకి వెళ్తే రూ.లక్షల్లో ఖర్చవుతుంది. అలాంటిది నయా పైసా ఖర్చులేకుండా ఇక్కడి డాక్టర్లు పూర్తి సక్సెస్ రేట్‌తో సర్జరీలు నిర్వహిస్తుండడం విశేషం.

సంవత్సరం లోపు పిల్లలకు సైతం

ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న శిశువులకు సైతం అధునాతన పద్ధతుల్లో శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నట్లు ఉస్మానియా ఆస్పత్రి కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఎస్.ఆనంద్ తెలిపారు. ఆస్పత్రిలోని పీడియాట్రిక్ యూరాలజీ విభాగం వేగంగా విస్తరించిందన్నారు. మౌలిక సదుపాయాల ఏర్పాటుతో పీడియాట్రిక్ ఎండోస్కోప్‌లు, లేజర్లు లాపరోస్కోపిక్ వంటి అధునాతన పరికాలు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. ఫ్రోలిథోటమీ, రీ-ట్రోగ్రేడ్ ఇంట్రారీనల్ సర్జరీ, యురేటెరోస్కోపిక్ లిథోట్రిప్సీ, ఇవన్నీ సాంప్రదాయకంగా చాలా చిన్న పిల్లల్లో సంక్లిష్టమైనవనీ, అధిక ప్రమాదకరమనీ తెలిపారు.

పిల్లల్లో సమస్యపై అధ్యయనం

ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఆధునిక లేజర్ చికిత్స కారణంగా చిన్నపిల్లలకు సైతం సమర్థవంతంగా చికిత్స చేయగలుగుతున్నామని డాక్టర్ ఆనంద్ వివరించారు. గర్భధారణ సమయంలో తల్లి సరైన ఆహారం తీసుకోకపోవడం, డీహైడ్రేషన్, అధిక కాల్షియం మోతాదు శరీరంలో ఉండడం ద్వారా పిల్లల్లో ఈ సమస్య ఏర్పడుతుందని తెలిపారు. దీనిపై మరింత వివరంగా తెలుసుకోవడానికి రానున్న రోజుల్లో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ సహాయంతో పరిశోధన చేయనున్నామని చెప్పారు.

Next Story