తెలంగాణలో 23 వేల ప్రభుత్వ బడుల మూసివేత?.. సీఎం రేవంత్‌కు మేధావుల బహిరంగ లేఖ

by Gantepaka Srikanth |

తెలంగాణలోని 27,000 ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను 4,000 లకు కుదించి, మిగిలిన బడులను మూసివేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై రాష్ట్రవ్యాప్తంగా విద్యావేత్తలు, మేధావులు, పౌర సమాజం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

తెలంగాణలో 23 వేల ప్రభుత్వ బడుల మూసివేత?.. సీఎం రేవంత్‌కు మేధావుల బహిరంగ లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని 27,000 ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను 4,000 లకు కుదించి, మిగిలిన బడులను మూసివేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై రాష్ట్రవ్యాప్తంగా విద్యావేత్తలు, మేధావులు, పౌర సమాజం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు జూలై 07న జస్టిస్ బి. చంద్రకుమార్, జస్టిస్ రాధారాణి, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ నాగేశ్వర్, దేశపతి శ్రీనివాస్, గోరటి వెంకన్న సహా మంది ప్రముఖ విద్యావేత్తలు, న్యాయమూర్తులు, సామాజిక విశ్లేషకులు, పౌర సమాజ ప్రతినిధులు సంతకాలతో కూడిన ఒక సుదీర్ఘ బహిరంగ లేఖను ముఖ్యమంత్రికి సమర్పించారు. 23,000 పాఠశాలల మూసివేత ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని, ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జూన్ 6వ తేదీన బెంగళూరులో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేసిన ఈ ప్రకటన తీవ్ర విద్యా, సామాజిక పరిణామాలకు దారితీస్తుందని లేఖలో హెచ్చరించారు.

విద్యాహక్కు చట్టం ఉల్లంఘన..

రాజ్యాంగంలోని ఆర్టికల్ 27A, విద్యా హక్కు చట్టం ప్రకారం పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్యనందించడం ప్రభుత్వ కనీస బాధ్యత అని మేధావులు గుర్తుచేశారు. ఈ నిర్ణయం అమలులోకి వస్తే రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలలో దాదాపు 500 గ్రామాల్లో ప్రాంతాలకు బడులు దూరమైతే రవాణా, భద్రతా కారణాల వల్ల బడులు శాశ్వతంగా మూతపడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. బడుగు, బలహీన వర్గాల పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు చదువు మధ్యలోనే ఆపేసి బాల కార్మికులుగా మారే ప్రమాదం ఉందని, ఇది దేశ చరిత్రలోనే అత్యంత తిరోగమన చర్యగా మిగిలిపోతుందని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వాగ్దానాల ఉల్లంఘన..

ఎన్నికల మేనిఫెస్టోలో విద్యపై పెట్టి ఖర్చు, భవిష్యత్తుపై పెట్టుబడి అని పేర్కొంటూ బడ్జెట్లో విద్యకు 15% నిధులు కేటాయిస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసినప్పటికీ, ప్రస్తుతం కేటాయింపులు చేసిన దాఖలాలు లేవని లేఖలో ఎండగట్టారు. గత ప్రభుత్వం మూసివేసిన 6,000 పాఠశాలలను మెరుగైన సదుపాయాలతో తిరిగి తెరుస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఏకంగా 2,000 పాఠశాలలను మూసివేయాలని తలపెట్టడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. ప్రభుత్వ బడులలో జీరో ఎనోట్మెంట్ ఏర్పడటానికి పాలకుల నిర్లక్ష్యం విద్యాశాఖలో పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణమని మేధావులు లేఖలో గణాంకాలతో సహా వివరించారు.

తక్షణమే చేపట్టవలసిన చర్యలు..

= బడుల మూసివేత ప్రకటనను తక్షణమే ఉపసంహరించుకోవాలి.

= అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తక్షణమే పూర్వ ప్రాథమిక విద్యను (Pee-Primary) ప్రవేశపెట్టి, ప్రతీ చిన్నగ్రామంలో ప్రాథమిక పాఠశాలను కొనసాగించాలి.

= అన్ని బడులలో అవసరమైన తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీరు, డిజిటల్ పనులు సమకూర్చాలి.

= ఖాళీగా ఉన్న అన్ని బోధన, బోధనేతర పోస్టులను భర్తీ చేయాలి. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించరాదు.

= ప్రైవేటు పాఠశాలలను అదుపు చేసేందుకు జీవో నెంబర్ 1ను పకడ్బందిగా అమలు చేయాలి.

= ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోకపోతే తెలంగాణ సమాజ భవిష్యత్తు ప్రశ్నార్ధ మవుతుందని, కావున ముఖ్యమంత్రి తమ నిర్ణయాన్ని తక్షణమే పునఃసమీక్షించుకోవాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.

Next Story