మరోసారి జ‌ర్నలిస్టుల స్థలం క‌బ్జాయ‌త్నం.. దౌర్జన్యంగా ఇళ్ల కూల్చివేత!

by Disha Web Desk 2 |
మరోసారి జ‌ర్నలిస్టుల స్థలం క‌బ్జాయ‌త్నం.. దౌర్జన్యంగా ఇళ్ల కూల్చివేత!
X

దిశ‌, ఎల్బీన‌గ‌ర్: ప్రభుత్వ స్థలంలో జర్నలిస్టులకు పట్టాలు పంపిణీ చేయగా కొంతమంది కబ్జాదారులు ఆ స్థలాన్ని కాజేసేందుకు కుట్రలు చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు జర్నలిస్టులు మంగ‌ళ‌వారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వయంగా రెవెన్యూ అధికారులు జర్నలిస్టులకు పట్టాలు పంపిణీ చేసినప్పటికీ సంబంధం లేని వ్యక్తులు ఆ స్థలంలోకి చొరబడి జర్నలిస్టులపై దాడికి సైతం పూనుకుంటున్నార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా పలువురుపై కేసు నమోదు చేశారు.. అయినప్పటికీ కబ్జాదారులు మాత్రం మళ్లీ జర్నలిస్టులపై పంజా విసురుతున్నారు. అబ్దుల్లాపూర్ మెట్ రెవెన్యూ మండల పరిధిలోని మునగనూరు గ్రామంలోని సర్వేనంబర్ 38/1లో జర్నలిస్టులకు కేటాయించిన స్థలంలో నిర్మించిన ఇళ్లను దౌర్జన్యంగా కూల్చివేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డికి జర్నలిస్టులు వినతి పత్రాన్ని అందజేశారు.

ఎల్బీనగర్, మలక్ పేట, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు సంబంధించిన వర్కింగ్ జర్నలిస్టులకు అబ్దుల్లా‌పూర్‌మెట్ మండల పరిధిలోని మునగనూరు సర్వే నంబర్ 38/1లోని స్థలంలో 2009లో 170 ఇళ్ల పట్టాలను ప్రభుత్వ వీకర్సెక్షన్ కింద మంజూరు చేసి పట్టాలను కూడా మంజూరు చేశారు. అట్టి స్థలంలో జర్నలిస్టులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం జరిగింది. రెవెన్యూ నిబంధనలను అతిక్రమించి భూమిని క్రయవిక్రయాలు చేస్తుండడంతో సదరు స్థలాన్ని రెవెన్యూ అధికారులు పీఓటీ యాక్ట్ కింద ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుని జర్నలిస్టులకు కేటాయించి పట్టాలను పంపిణీ చేశారు. త‌మ‌కు కేటాయించిన స్థలంలో వెంటనే ఇళ్ల నిర్మాణాలు కూడా చేపట్టడం జరిగిందని జర్నలిస్టులు ఫిర్యాదులో పేర్కొన్నారు. న్యాయస్థానం నిబంధనల మేరకు జనవరి 2019లో జాయింట్ కలెక్టర్ ఇచ్చిన ఫైనల్ ఉత్తర్వుల ఆధారంగా త‌మ‌ స్థలంలో ఇంటి నిర్మాణాలు ప్రారంభించామని జ‌ర్నలిస్టులు తెలిపారు.

అయితే 2019 ఆగస్టు 16,17వ తేదీన జూపల్లి సారాబాయ్, బొడ్డుపల్లి రాజు, బొడ్డుపల్లి అశోక్, ఊపల్లి రాధమ్మ, దుబ్బాక రాములమ్మ తమ మనుషులతో త‌మ‌ స్థలాల్లోకి అక్రమంగా చొరబడి ఇళ్లను, తుది దశలో ఉన్న ఇతర ఇళ్ల నిర్మాణాలను కూల్చివేశారని వెల్లడించారు. అక్కడికి వెళ్లిన త‌మ తోటి జర్నలిస్టులను అసభ్యకర పదజాలంతో దూషిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. వెంటనే తాము హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసామని తెలిపారు. పలువురిపై కేసు కూడా నమోదయిందని వివ‌రించారు. తిరిగి ఈనెల 15వ తేదీన త‌మ‌ స్థలంలోకి చొరబడి నిబంధనలకు విరుద్ధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, త‌మ‌కు కేటాయించిన‌ స్థలంలో చదును చేశారని తెలిపారు. త‌మ‌ కేటాయించిన స్థలంలోకి న్యాయస్థానం తీర్పును అతిక్రమిస్తూ చొరబడ్డ వారిపై చ‌ట్టప‌ర‌మైన కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో మేకల సత్యనారాయణ, తగరం సత్యనారాయణ, చిత్రం సైదులు, కటకం సుభాష్, చంద్రశేఖర్, దీన్ దయాల్, శ్రీనివాస్ రావు, కృష్ణారెడ్డి, దుబ్బాక యాదయ్య, చండీశ్వర్, జగన్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ వెంకన్న, రవి, చెరుకు వెంకట్ స్వామి, రాజశేఖర్, గొట్టిపర్తి శ్రీనివాస్ గౌడ్, నర్రే రమేష్ కుమార్, ముత్యాలు, భక్తవత్సలం, మల్లేష్, సాగర్, వేణు తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed