హర్మూజ్ దిగ్బంధనం వేళ భారత్‌కు చమురు : హైదరాబాద్‌ ఇరాన్ కాన్సులేట్‌

by Ramesh Naini |

అమెరికా నావికాదళం హర్మూజ్ జలసంధిని దిగ్బంధించినప్పటికీ, ఇరాన్ నుండి ముడి చమురు (క్రూడ్ ఆయిల్) సరఫరా భారత్‌కు విజయవంతంగా చేరుకుంది.

హర్మూజ్ దిగ్బంధనం వేళ భారత్‌కు చమురు : హైదరాబాద్‌ ఇరాన్ కాన్సులేట్‌
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా నావికాదళం హర్మూజ్ జలసంధిని దిగ్బంధించినప్పటికీ, ఇరాన్ నుండి ముడి చమురు (క్రూడ్ ఆయిల్) సరఫరా భారత్‌కు విజయవంతంగా చేరుకుంది. దిగ్బంధనానికి కొద్దిసేపటి ముందే ఇరాన్ జలాల నుండి బయలుదేరిన సూపర్ ట్యాంకర్ ‘డోర్నా’ (Dorna) తాజాగా భారత దక్షిణ తీరంలో ప్రత్యక్షమైంది. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా శనివారం ఈ కీలక వివరాలను వెల్లడించింది.

వారంలో 60 లక్షల బారెళ్లు..

అమెరికా ఆంక్షలు, నావికాదళం గస్తీ నడుమ కూడా వారం రోజుల వ్యవధిలో భారత్‌కు మూడు విడతల్లో దాదాపు 60 లక్షల (6 మిలియన్) బారెళ్ల ముడి చమురు చేరుకోవడం గమనార్హం. ప్రస్తుతం దక్షిణ తీరానికి చేరుకున్న ‘డోర్నా’ నౌక.. సమీపంలోని స్థానిక రిఫైనరీకి సుమారు 20 లక్షల బారెళ్ల చమురును అందజేయనున్నట్లు సమాచారం.

నౌక కదలికల ధృవీకరణ..

భారత దక్షిణ తీరం వద్ద ఇరాన్‌కు చెందిన వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్ (VLCC) ఉన్నట్లు షిప్పింగ్ ఇంటెలిజెన్స్ సంస్థ ‘ట్యాంకర్‌ట్రాకర్స్’ (Tanker Trackers) కూడా ధృవీకరించింది. ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (AIS) ద్వారా ఈ భారీ నౌక కదలికలను గుర్తించినట్లు తెలిపింది.

ఏడేళ్ల నిరీక్షణకు తెర

గడచిన ఏడేళ్లలో ఇరాన్ నుంచి భారత్‌కు ఈ స్థాయి సామర్థ్యం గల వీఎల్‌సీసీ (VLCC) షిప్‌మెంట్ రావడం ఇదే తొలిసారి అని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గత వారం వచ్చిన మొదటి విడతలోని 20 లక్షల బారెళ్ల చమురును ఇప్పటికే అన్‌లోడ్ చేశారు. అంతర్జాతీయంగా కఠిన ఆంక్షలు, నిశిత పరిశీలన ఉన్నప్పటికీ.. తాజా పరిణామాలు భారత్-ఇరాన్ మధ్య వేగంగా బలపడుతున్న చమురు వాణిజ్యానికి స్పష్టమైన సంకేతంగా నిలుస్తున్నాయి.

Next Story