ప్రజావాణిలో ఫిర్యాదు చేద్దామంటే.. ఒంటిగంటైనా సార్లు రాలే..!

by Disha Web Desk 4 |
ప్రజావాణిలో ఫిర్యాదు చేద్దామంటే.. ఒంటిగంటైనా సార్లు రాలే..!
X

దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్ : అధికారుల నిర్లక్ష్యంతో ఫిర్యాదు దారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు ఎవరు హాజరు కాకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తుదారులు అధికారుల కోసం ఎర్రటి ఎండలోనే నిరీక్షణ తప్పడం లేదు. వందల సంఖ్యలో ధరణి సమస్యలతో బాధపడుతూ వస్తున్న రైతులే అధిక సంఖ్యలో ఉండడంతో జిల్లా కలెక్టర్ కోసం ఎదురు చూడక తప్పడం లేదు. కనీసం కలెక్టరేట్ కార్యాలయంలో నిలువ నీడ లేక కూర్చునే కుర్చీలు లేక అక్కడక్కడ చెట్ల కింద తలదాచుకునే పరిస్థితి దాపురించిందని అధికారుల తీరుపై దరఖాస్తుదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కనీసం గుక్కెడు మంచి నీరు కూడా ఏర్పాటు చేయకపోవడంతో జిల్లా అధికారులపై దరఖాస్తుదారులు పెదవి విరుస్తున్నారు. జిల్లా అదనపు కలెక్టర్ సెలవులో ఉండడంతో ఇతర దరఖాస్తులు కూడా తీసుకునేందుకు ఎవరూ లేక గంటల తరబడి దరఖాస్తుదారులు క్యూ లైన్‌లో ఎండకు ఇతర చెట్ల కింద కాలం వెళ్ళదిస్తున్నారు. ప్రతి నెల 8వేలకు పైగా ధరణి సమస్య దరఖాస్తులు వస్తున్న అధికారులు అలసత్వాన్ని వీడకపోవడం విశేషం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి త్వరగా వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story

Most Viewed