పైసా వసూల్!

by Disha Web Desk 12 |
పైసా వసూల్!
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో రెండు రోజుల్లో ముగుస్తుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. తమకు విధించిన టార్గెట్ ను పూర్తి చేసి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే పనిలో పడ్డారు. అందుకోసం వివిధ శాఖాలు తమ పరిధిలో ప్రజల నుంచి రావాల్సిన ఫీజులు వసూలు చేయడంపై ఫోకస్ పెట్టాయి.

వాయిదా ఆలస్యమైతే రూ.3 లక్షల పైన్

రాష్ట్ర ఆదాయానికి లిక్కర్ అమ్మకాలే ప్రధాన ఆదాయం. లిక్కర్ సేల్ ద్వారా ప్రతి నెలా సర్కారుకు రూ.3,500కోట్ల ఆదాయం వస్తున్నది. లిక్కర్ విక్రయించేందుకు లైసెన్సులు దక్కించుకున్న షాపు ఓనర్లు వాయిదాల రూపంలో ఫీజును ప్రభుత్వానికి చెల్లిస్తుంటారు. ఈసారి మాత్రం మార్చి 21 లోపు 8వ వాయిదా చెల్లించాలని అధికారులు డెడ్‌లైన్ విధించారు. నోటీసులు సైతం జారీ చేశారు. నిర్ణీత గడువు లోపు డబ్బులు కట్టకపోతే రూ.3 లక్షల ఫైన్ విధిస్తామని హెచ్చరించారు. ఆ ఫైన్‌ను 9 వాయిదాలో చెల్లించాలని ఆదేశించారు. దీంతో షాప్ ఓనర్లు అప్పు చేసి మరి 8వ వాయిదాను చెల్లించక తప్పలేదు.

ఫైన్ వసూళ్లలో ట్రాఫిక్ పోలీసులు బిజీ

రెండు మూడు రోజులుగా హైదరాబాద్ నగర రోడ్లపై ట్రాఫిక్ పోలీసులు పెద్ద ఎత్తున కనపడుతున్నారు. కనిపించిన ప్రతి వెహికల్‌ను ఆపుతున్నారు. ఆ వాహనంపై ఏమైనా పెండింగ్ చలానాలు ఉన్నాయా అని తనిఖీ చేస్తున్నారు. ఒకవేళ వాహనంపై పెండింగ్ చలానాలు ఉంటే వెంటనే వాటిని ఆన్‌లైన్‌లో కట్టాలని వాహన బాధ్యులకు సూచిస్తున్నారు. ఫైన్ కట్టిన తర్వాతే వెహికల్ తీసుకెళ్లాలని చెబుతున్నారు. ఫైనాన్స్ ఇయర్ ఎండింగ్‌లోపు పెండింగ్ చాలన్లు ఉండకూడదని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో ట్రాఫిక్ పోలీసులు ఎండను సైతం లెక్క చేయకుండా ఫైన్‌లు వసూలు చేసేందుకు కష్టపడుతున్నారు.

ప్రాపర్టీ టాక్స్ కోసం చాటింపులు

ప్రాపర్టీ టాక్స్ కట్టాలని మున్సిపల్ అధికారులు ప్రజలకు మెసేజ్‌లు పంపుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని జోన్ల అధికారులు ఇదే పనిలో నిమగ్నమయ్యారు. ట్యాక్స్ పెండింగ్ ఉన్న ఇంటికి వెళ్లి పన్ను కట్టాలని కోరుతున్నారు. జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో ఆటోలకు మైకులు ఏర్పాటు చేసి ఇంటి పన్ను కట్టాలని ప్రచారం చేస్తున్నారు. ఈనెల 31 లోపు టాక్స్ చెల్లించాలని లేక పోతే 2 శాతం వడ్డీ సైతం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.



Next Story

Most Viewed