ఓబుళాపురం మైనింగ్ కేసులో ట్విస్ట్.. ఆ ఇద్దరికీ హైకోర్టు నోటీసులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-18 06:48:02  IST  )

ఓబుళాపురం మైనింగ్‌ కేసు (Obulapuram Mining Case)లో A8, A9 నిందితులుగా ఉన్న అప్పటి గనులశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy, పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందం‌ (Kripanandam)లను నిర్దోషులుగా ప్రకటిస్తూ మే 6న హైదరాబాద్‌ సీబీఐ కోర్టు తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే.

ఓబుళాపురం మైనింగ్ కేసులో ట్విస్ట్.. ఆ ఇద్దరికీ హైకోర్టు నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఓబుళాపురం మైనింగ్‌ కేసు (Obulapuram Mining Case)లో A8, A9 నిందితులుగా ఉన్న అప్పటి గనులశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy, పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందం‌ (Kripanandam)లను నిర్దోషులుగా ప్రకటిస్తూ మే 6న హైదరాబాద్‌ సీబీఐ కోర్టు తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. అయితే, ఆ తీర్పును రద్దు చేయాలని కోరుతూ సీబీఐ (CBI) ఇటీవలే హైకోర్టులో అప్పీలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. కేసులో నిందితులైన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఐఏఎస్‌ అధికారి కృపానందంలకు శిక్ష విధించాలంటూ ఆ పిటిషన్‌లో వెల్లడించింది. అయితే, అనూహ్యంగా విచారణ నుంచి జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌ రెడ్డి (B Vijaysen Reddy) తప్పుకున్నారు. నిందితుల్లో ఒకరి తరఫున గతంలో తాను వాదనలు వినిపించానని, అందువల్ల సీబీఐ అప్పీలుపై విచారణ చేపట్టలేని తెలిపారు. దీంతో తాజాగా మరో న్యాయమూర్తి సీబీఐ అప్పీల్‌పై ఇవాళ విచారణ చేపట్టారు. సీబీఐ తరఫున శ్రీనివాస్‌ కపాటియా వాదనలు వినిపించగా.. హైకోర్టు సబితాఇంద్రారెడ్డితో పాటు కృపానందంను కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది.

కాగా, అంతరగంగమ్మ (Anthara Gangamma) కొండల్లో ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ (OMC)కి మైనింగ్‌ లీజులను కట్టబెట్టడానికి జరిగిన కుట్రలో కృపానందం, సబితల పాత్ర ఉందని అప్పీలులో సీబీఐ (CBI) పేర్కొంది. అంతరగంగమ్మ కొండ వద్ద 68.5 హెక్టార్ల లీజులో వీరు కీలక పాత్ర పోషించి లీజులు మంజూరు చేయడంతో ఓఎంసీ అక్రమంగా 29.32 లక్షల టన్నుల ఖనిజాన్ని తరలించిందని తెలిపింది. లీజులకు సంబంధించి ఐబీఎం (IMB)తో పాటు పర్యావరణ అనుమతులు పొందాలంటూ అప్పటి కార్యదర్శి కృపానందం (Kripanandam) 2005 నవంబరు 9న ఓఎంసీకి తాత్కాలిక లీజు మంజూరు చేశారని వెల్లడించారు. అందుకు మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) కూడా ఆమోదం తెలిపారని అప్పీలులో పేర్కొన్నారు. నిందితులకు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను సీబీఐ కోర్టు పట్టించుకోవడం లేదని సీబీఐ అధికారులు పేర్కొన్నారు. బి.వి.శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దనరెడ్డితో పాటు కృపానందం, సబితా ఇంద్రారెడ్డిలపై ఐపీసీ 120 (బి) రెడ్‌విత్‌ 409, 13(2) రెడ్‌విత్‌ 13(1)(డి)ల అభియోగాలు రుజువు కాలేదని, నిర్దోషులుగా విడుదల చేసిన సీబీఐ కోర్టు తన ముందున్న రికార్డులను, ఆధారాలను పరిశీలించలేదని తెలిపారు. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్‌ సుబ్రమణ్యం ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వారు నిర్దోషులని సీబీఐ కోర్టు ప్రకటించిందని అప్పీలులో పేర్కొన్నారు.

Next Story