Sarpanch elections: సర్పంచ్ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు లైన్‌ క్లియర్!

by Prasad Jukanti |   (  Updated:2025-02-12 10:27:14  IST  )

నోటాకు కాంగ్రెస్ ‘నో’.. బీఆర్ఎస్ ‘యస్’ చెప్పాయి.

Sarpanch elections:  సర్పంచ్ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు లైన్‌ క్లియర్!
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: త్వరలోనే రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) ఏకగ్రీవమైన చోట 'నోటా' తో ఎన్నిక నిర్వహించాలనే ప్రతిపాదన ఈసారి అమలులోకి రావడం లేదని తెలుస్తోంది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో నోటాను (NOTA) ఒక కల్పిత అభ్యర్థిగా పెట్టాలని ఈసీ భావిస్తున్న తరుణంలో ఈ అంశంపై ఇవాళ తెలంగాణ ఎన్నికల సంఘం (Telangana State Election Commission) గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం అయింది. ఈ సమావేశానికి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, వామపక్షాలు, టీడీపీ, జనసేన ప్రతినిధులు హాజరయ్యారు. పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. ఈ తరహా విధానం ఇప్పపటికే పలు రాష్ట్రాలు పాటిస్తున్న నేఫథ్యంలో తెలంగాణలోనూ ఈ విధానం అమలు చేయడంపై పార్టీల అభిప్రాయాలను ఈసీ సేకరించింది. అయితే ఈసీ మీటింగ్ తో ఈసారే ఈ విధానం అమల్లుకి వస్తుందనే చర్చ జరుగుతోంది. కానీ ఈ అంశం ఇంకా చర్చల దశలోనే ఉండటంతో ఈసారి ఎన్నికల్లో ఏకగ్రీవమైన స్థానాల్లో నోటాతో ఎన్నిక నిర్వహించడం సాధ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నది.

నోటాకు కాంగ్రెస్ నో.. బీఆర్ఎస్ యస్:

ఇవాళ ఎన్నికల సంఘం నిర్వహించిన సమావేశంలో నోటాపై రాజకీయ పార్టీల అభిప్రాయలను ఎన్నికల సంఘం సేకరించింది. పార్టీల అభిప్రాయాలను ఎల్లుండి వరకు లిఖితపూర్వకంగా ఇవ్వాలని సూచించింది. ఈ సమావేశంలో నోటాను అభ్యర్థిగా పరిగణించడాన్ని అధికార కాంగ్రెస్ (Congress) పార్టీ వ్యతిరేకించింది. ఏకగ్రీవమైన చోట ఎన్నిక నిర్వహించడం ఖర్చుతో కూడిన అంశం అని అభిప్రాయపడింది. నోటాతో ఎన్నిక నిర్వహించినా కానీ సెకండ్ లార్జెస్ట్ పార్టీని విజయంగా ప్రకటించాలని సూచించింది. బీఆర్ఎస్ (BRS) స్పందిస్తూ ఏకగ్రీవ ఎన్నిక కోసం బెదిరింపులు, బలప్రదర్శన చేసే అవకాశం ఉందని నోటాను అభ్యర్థిగా పరిగణించడాన్ని సమర్థించింది. కొత్త మండలాల వివరాలను రాజకీయ పార్టీలకు ఇవ్వాలని కోరింది. ఏకగ్రీవ ఎన్నికలపై సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున తమ అభిప్రాయం చెప్పలేమని బీజేపీ (BJP) తెలిపింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు ఈ విషయంపై నిర్ణయానికి అధికారం లేదని పంచాయతీ ఎన్నికల నిర్ణయం ప్రభుత్వమే తీసుకోవాలని పేర్కొంది. నోటాతో ఎన్నిక ఉండాలని సుప్రీంకోర్టు ఇప్పటికే చెప్పిందని, అభ్యర్థి కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తె రీ ఎలక్షన్ కరెక్ట్ కాదని సీపీఎం అభిప్రాయం చెప్పింది. తమ అభిప్రాయాన్ని రెండు మూడు రోజుల్లో చెప్తామన్న టిటీడీపీ చెప్పగా సింగల్ కాండిడేట్ ఉన్నా నోటా ఉండాలన్న జనసేనా పార్టీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

Next Story