MLA Quota MLC Elections : ముగిసిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం

by Muthe.Rajitha |   (  Updated:2025-03-10 12:31:17  IST  )

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల(MLA Quota MLC Elections)కు నామినేషన్ల(Nominations) గడువు సోమవారం సాయంత్రంతో పూర్తయ్యింది.

MLA Quota MLC Elections : ముగిసిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం
X

దిశ, వెబ్ డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల(MLA Quota MLC Elections)కు నామినేషన్ల(Nominations) గడువు సోమవారం సాయంత్రంతో పూర్తయ్యింది. తెలంగాణ(Telangana)లో 5 స్థానాలకు, ఏపీ(AP)లో 5 స్థానాలకు గానూ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు మార్చ్ 2న నోటిఫికేషన్ విడుదల అయిన విషయం తెలిసిందే. కాగా తెలంగాణలో కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేల సంఖ్యాబలమ ఆధారంగా కాంగ్రెస్ కు 4 స్థానాలు దక్కగా.. బీఆర్ఎస్ కు ఒక స్థానం దక్కింది. అయితే పొత్తులో భాగంగా తమ 4 స్థానాల్లో ఒకదానిని సీపీఐ(CPI)కి కేటాయిస్తున్నట్టు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. కాగా కాంగ్రెస్ తరపున విజయశాంతి, అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయక్ లు బరిలో ఉండగా.. వీరి మిత్రపక్షం సీపీఐ తరపున నెల్లికంటి సత్యం పేరును ఖరారు చేసింది ఆ పార్టీ.

ఇక గులాబీ పార్టీ తరపున దాసోజు శ్రవణ్ కుమార్ పేరును ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. వీరితోపాటు చలిక చంద్రశేఖర్, భోజరాజ్ కోయాల్కర్, జాజుల భాస్కర్, కంటే సాయన్నలు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. ఈ 11 మంది అభ్యర్థులు నేడు నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఏపీలో కూటమికి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని బట్టి 5 స్థానాలు దక్కగా.. అందులో ఒక స్థానాన్ని జనసేన(Janasena)కు మరో స్థానాన్ని బీజేపీ(BJP)కి కేటాయించి, మిగిలిన మూడు స్థానాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించింది టీడీపీ(TDP). టీడీపీ నుంచి కావాలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు పేర్లను ప్రకటించగా.. జనసేన తరపున కొణిదెల నాగబాబు, బీజేపీ తరపున సోము వీర్రాజు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికలకు ఈనెల 20న పోలింగ్ జరగనుండగా.. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు జరుపుతారు .

Next Story