కాళేశ్వరంతో నో యూజ్.. అసెంబ్లీలో ప్రభుత్వం కీలక ప్రకటన

by Disha Web Desk 13 |
కాళేశ్వరంతో నో యూజ్.. అసెంబ్లీలో ప్రభుత్వం కీలక ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: డిజైన్, నాణ్యత లోపం, అవినీతి వల్లే కాళేశ్వరం దెబ్బతిన్నదని, ప్రాజెక్టు ప్రస్తుతానికి నిరుపయోగమని, అందులో నీటిని నింపలేమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెబ్లీలో పేర్కొన్నారు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ సందర్భంగా సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన మంత్రి మాట్లాడుతూ ప్రాజెక్టుకు కేసీఆరే చీఫ్ ఇంజినీర్, చీఫ్ డిజైనర్‌గా వ్యవహరించారని, వైఫల్యంపై ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందిపోయి ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. భారీ నాణ్యతా లోపం ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ స్పష్టం చేసిందన్నారు. కాగ్ రిపోర్ట్ ఆధారంగా బాధ్యులపై చర్యలు ఉంటాయని మంత్రి వెల్లడించారు.

గుత్తేదారుకు వేలకోట్ల లబ్ధి..

బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖలో జరిగినంత దోపిడీ మునుపెన్నడూ జరగలేదని మంత్రి ఆరోపించారు. వందేళ్లు ఉండాల్సిన మేడిగడ్డ బ్యారేజీ కుప్పకూలే స్థితికి వచ్చిందన్నారు. కాళేశ్వరానికి రూ. 81,911 కోట్లతో సీడబ్ల్యూసీ అనుమతి ఇస్తే గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో వ్యయం రూ.1.47 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. ప్రస్తుత లెక్కల ప్రకారం ఈ ప్రాజెక్టు పూర్తికి రూ. 2 లక్షల కోట్లు దాటుతుందన్నారు. గుత్తేదారులకు వేల కోట్లు లబ్ధి చేకూర్చారని కాగ్ నివేదికలో చెప్పిందన్నారు.

డేంజర్‌లో అన్నారం, సుందిళ్ల..

మేడిగడ్డ బ్యారేజీ తరహాలో అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు సైతం డేంజన్ జోన్‌లో ఉన్నాయని ఎన్డీఎస్ఏ తెలిపిందని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం అన్ని రంగాల్లో వాడే విద్యుత్ కంటే ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగించే విద్యుత్ ఎక్కువని మంత్రి పేర్కొన్నారు. అలాగే బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్లే కృష్ణాజలాల్లో తెలంగాణకు నష్టం జరిగిందన్నారు.

శ్వేతపత్రం సత్యదూరం : హరీశ్ రావు

ఇరిగేషన్‌పై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత‌పత్రం తప్పుల తడకగా, సత్యదూరంగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. గత ప్రభుత్వంపై బురద చల్లాలనే వైట్‌పేపర్ ప్రవేశపెట్టారన్నారు. మిడ్‌మానేరు ప్రాజెక్టు తమ హయాంలోనే పూర్తి చేశామన్నారు. చర్చలో తాను మాట్లాడేందుకు కనీసం 2 గంటల సమయం ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు.



Next Story

Most Viewed