అది చిరుత పులేనా..?

by Ratna Kumari |   (  Updated:2025-12-19 13:26:21  IST  )

దిశ, తాడ్వాయి ​: మండలంలో ఎర్రపహడ్ గ్రామ శివారులో సోమవారం ఒక రైతుకు చెందిన దూడపై జరిగిన దాడి స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. క

అది చిరుత పులేనా..?
X

దిశ, తాడ్వాయి ​: మండలంలో ఎర్రపహడ్ గ్రామ శివారులో సోమవారం ఒక రైతుకు చెందిన దూడపై జరిగిన దాడి స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. కట్టేసి ఉన్న పశువుపై క్రూర మృగం విరుచుకుపడి చంపేయడంతో అది చిరుత పులేనని బాధితుడు స్థానిక రైతులు బలంగా నమ్ముతున్నారు. ఘటన జరిగి మూడు రోజులు గడుస్తున్నా.. అది ఏ జంతువు అన్నది నిర్ధారించడంలో అటవీ శాఖ అధికారులు మీనమేషాలు లెక్కించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

​ రంగంలోకి దిగినా తేలని వైనం

మంగళవారం రోజే అటవీ శాఖ అధికారులు, పశువైద్యులతో కలిసి ఘటన స్థలానికి చేరుకొని క్షుణ్ణంగా పరిశీలించినట్లు సమాచారం. పాదముద్రలు, దూడ శరీరంపై ఉన్న గాయాలను బట్టి అది ఏ జంతువు అనే విషయాన్ని అటవీ అధికారులు కనిపెట్టాల్సి ఉంది. కానీ, ఇప్పటివరకు చిరుతా.? లేక మరేదైనా అడవి జంతువా.? అన్న దానిపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో గ్రామస్థుల్లో ఆందోళన మరింత పెరిగింది.

భయం గుప్పిట్లో పల్లెలు

అటవీ శాఖ నుంచి సరైన సమాచారం లేకపోవడంతో ఎర్రపహడ్ తో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో జనం భయం భయంగా గడుపుతున్నారు.చీకటి పడితే పొలాల వైపు వెళ్లడానికి రైతులు సాహసించడం లేదు. ఒకవేళ అది చిరుతైతే మరోసారి దాడి చేసే అవకాశం ఉంది కదా? అధికారులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? అని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, అది ఏ జంతువో తేల్చి, రక్షణ చర్యలు బోన్లు ఏర్పాటు చేయడం,గస్తీ పెంచడం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story