అసెంబ్లీలో ఎమ్మెల్యే మ‌ద‌న్ మోహ‌న్ వ్యాఖ్య‌లపై ఆ గ్రామ‌స్తులు ఆగ్ర‌హం

by Ratna Kumari |

అసెంబ్లీలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మ‌ద‌న్ మోహ‌న్ రావు మాట్లాడిన తీరుపై మండ‌ల ప‌రిధిలోని సోమార్ పేట గ్రామ‌స్తులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

అసెంబ్లీలో ఎమ్మెల్యే మ‌ద‌న్ మోహ‌న్ వ్యాఖ్య‌లపై ఆ గ్రామ‌స్తులు ఆగ్ర‌హం
X

దిశ‌, ఎల్లారెడ్డి : అసెంబ్లీలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మ‌ద‌న్ మోహ‌న్ రావు మాట్లాడిన తీరుపై మండ‌ల ప‌రిధిలోని సోమార్ పేట గ్రామ‌స్తులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బుధవారం పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల‌సమావేశంలో గ్రామస్తులు మాట్లాడారు. గ‌త ఏడాది డిసెంబ‌ర్ లో జ‌రిగిన స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో గ్రామంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌లు పూర్తిగా తెలుసుకోకుండా అసెంబ్లీలో ఎమ్మెల్యే ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడ‌టం త‌గ‌ద‌న్నారు. స‌ర్పంచ్ ఎన్నిక‌ల లెక్కింపు తెల్ల‌వారిన రోజునే గ్రామంలో ఓడిపోయిన స‌ర్పంచ్ అభ్య‌ర్థి పై గెలిచిన స‌ర్పంచ్, అత‌ని సోద‌రుడు ఉద్దేశ‌పూర్వ‌కంగానే ట్రాక్ట‌ర్ తో దాడి చేసిన విష‌యం అంద‌రికీ తెలుసు అని వారు తెలిపారు. ఈ సంఘ‌ట‌న‌లో ప‌లువురు మ‌హిళ‌ల‌తో పాటు ఓట‌మిపాలైన స‌ర్పంచ్ అభ్య‌ర్థి, చిన్న పిల్ల‌వాడికి తీవ్ర గాయాల‌య్యాయ‌ని.. వారిని హుటాహుటిన హైదరాబాద్ తరలించి మెరుగైన చికిత్స అందించారు.


ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ బీఆర్ఎస్ అధిష్టానానికి సమాచారం అందించిన వెంటనే బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తక్షణమే స్పందించి ఆసుపత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు. అనంతరం వారి చికిత్స నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయ‌కులు క‌క్ష క‌ట్టి ట్రాక్ట‌ర్ తో దాడి చేశార‌ని వారు ఆరోపించారు. కానీ అసెంబ్లీలో ఎమ్మెల్యే మ‌ద‌న్ మోహ‌న్ గ్రామంలో పాత క‌క్ష‌ల వ‌ల్ల‌నే ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింద‌ని చెప్ప‌డం హాస్య స్ప‌దంగా ఉంద‌న్నారు. నిజ నిర్ధార‌ణ చేయ‌డానికి ఎమ్మెల్యే మ‌ద‌న్ మోహ‌న్ రావు మా గ్రామానికి వ‌చ్చి.. ఎలాంటి పాత క‌క్ష‌లు ఉన్నాయో నిరూపించాల‌ని వారు డిమాండ్ చేశారు. బాధితుల‌కు చేయూత అందించ‌డం పోయి మాపై లేనిపోని నింద‌లు మోప‌డం త‌గ‌ద‌న్నారు. ఇప్ప‌టికైనా దోషుల‌ను క‌ఠినంగా శిక్షించే విధంగా కృషి చేసి నిజాయితినీ నిరూపిచుకోవాల‌న్నారు. ఈ ఘ‌ట‌న పార్టీల‌కు సంబంధం లేద‌ని చెప్పిన ఎమ్మెల్యే.. ఏం తెలుసుకొని కాంగ్రెస్ మండ‌ల అధ్య‌క్షుడి ప‌ద‌వీ నుంచి సాయిబాబా ను తొల‌గించిన‌ట్టు లెట‌ర్ ఫ్యాడ్ పై సంత‌కం చేసి.. మీడియా ముందు విడుద‌ల చేశార‌ని ప్ర‌శ్నించారు. రాజ‌కీయాల‌కు సంబంధం లేకుంటే ఈ చ‌ర్య ఎందుకు తీసుకున్నార‌ని ప్ర‌శ్నించారు. ఈ స‌మావేశంలో గ్రామ‌స్తులు పంజా గౌడ్ నారాయ‌ణ‌, సుద‌ర్శ‌న్, ల‌క్ష్మీ నారాయ‌ణ‌, కిషోర్, జ‌నార్ద‌న్, వెంక‌ట్రామ్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story