ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పాలి

by Web Desk |
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పాలి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: పార్లమెంట్ సాక్షిగా రైతులకు ఇచ్చిన హామీలను బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని ఏఐకేఎస్‌‌సీసీ జిల్లా ఇన్‌చార్జి, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్ రైతాంగానికి పిలుపునిచ్చారు. జనవరి 31న దేశవ్యాప్తంగా రైతు విద్రోహ దినంగా పాటించాలని ఏఐకేఎస్‌సీసీ ఇచ్చిన పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 750కి పైగా రైతులు చనిపోయినా, మొక్కవోని దీక్షతో ప్రపంచ ఉద్యమ చరిత్రలో ఢిల్లీలో రైతులు చేసిన పోరాటం ఒక పేజీని లిఖించుకున్నదని కొనియాడారు.

వ్యవసాయ రంగాన్ని ఏదో ఒక రకంగా బడా కార్పొరేట్ శక్తులకు అప్పగించే కుట్రలో భాగంగానే బీజేపీ కేంద్ర మంత్రులు ప్రకటనలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఇప్పటికైనా రైతుల పోరాట చరిత్రను బీజేపీ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. త్వరలో జరుగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాల్చి వాతపెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి, రైతు సంఘం రాష్ట్ర నాయకులు కంజర భూమన్న, సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, ఏఐకేఎమ్ఎస్ రాష్ట్ర నాయకులు బి.భాస్కర్, ఏఐకేఎమ్ఎస్ రాష్ట్ర నాయకులు బీ-దేవరం, జేఏసీ చైర్మన్ భాస్కర్, కే.గంగాధర్, పి.రామకృష్ణ, నాయకులు బి.గంగారెడ్డి, వి.భూమయ్య, సీహెచ్ సాయి గౌడ్, అనీష్, పీడీఎస్‌‌యూ నాయకులు కల్పన తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed