ఏడి సర్వే పై భగ్గుమన్న బాధితులు..

by Disha Web Desk 20 |
ఏడి సర్వే పై భగ్గుమన్న బాధితులు..
X

దిశ, భిక్కనూరు : నాడు సర్వే చేసి గుంట భూమి కూడా పోలేదని నిర్ధారించిన సర్వేయర్... మళ్లీ అదే స్థలంలో సర్వే చేసి రహదారి విస్తరణ పనుల్లో భాగంగా 1.4 గుంటల భూమి పోయిందని ప్రకటించడం నాలుగు దిక్కుల ఉన్న పట్టాదారులైన బాధితులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకుండా ఏకపక్షంగా సర్వే నిర్వహించడం పై బాధితులు భగ్గుమంటున్నారు. సోమవారం భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారి పక్కన భిక్కనూరు, దోమకొండ, స్టేషన్లకు సంబంధించి రెండు పోలీస్ స్టేషన్ల ఫోర్సును పెట్టి ఏడి సర్వే నిర్వహించడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాము నోటీసులు తీసుకోవడం వల్లే ఇక్కడ జరుగుతున్న సర్వేకు హాజరయ్యామని, మా అభిప్రాయాలను, తమవద్ద ఉన్న ఆధారాలు పరిశీలించకుండానే ఏకపక్షంగా సర్వేచేయడం ఎంతవరకు సమంజసమని ఏడి శ్రీనివాస్ ను ప్రశ్నించారు. దీంతో ఆయన సమాధానం చెబుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 221 సర్వేనెంబర్ మాత్రమే కొలతలు వేశానని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే తహసిల్దార్, లేకుంటే కలెక్టర్ వద్దకు వెళ్లి కలవాలని తాను ఏమీ చేయలేనని స్పష్టం చేశాడు. దీంతో ఆగ్రహించిన బాధితులు రాసిన పంచనామ పేపర్ల పై సంతకాలు పెట్టమంటే పెట్టమని మొండికేశారు. 237 లోని అసైండ్ భూమి కూడా మీరు కొలిచిన దాంట్లోకి వచ్చిందని, అయినప్పటికీ ఆ విషయం చెప్పకుండా, చుట్టుపక్కల వారి అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకోకుండా వన్ సైడ్ సర్వే చేసి హద్దులు పాతిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో బాధితుల వద్దకు పోలీసులు చేరుకొని వారు లొల్లి పెట్టకుండా అడ్డుకొని బాధితులను సముదాయించి సామరస్య పూర్వకంగా మాట్లాడుకోవాలని సూచించారు. ఈలోపు ఏడి సర్వేయర్ శ్రీనివాస్ బయటకు రాగా తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు 221 సర్వేనెంబర్ లో 6.08 ఎకరాల భూమికి గాను, ఎకరం 4 గుంటల భూమి రోడ్డు విస్తరణ పనుల్లో పోయిందని చెప్పాడు. ఎక్కడినుంచి ఆ స్థలం పోయిందన్నది చూపించలేకపోయారు. ఏ పహానిల ప్రకారం సర్వే చేశారని "దిశ " సర్వేయర్ శ్రీనివాసును ప్రశ్నించగా, తమ వద్దఉన్న కాస్తుల ప్రకారం సర్వే చేసినట్లు చెప్పారు. సర్వేచేసిన పంచనామా పేపర్ పై బాధితులు, గ్రామస్తులు ఎవరు సంతకాలు చేయకపోగా, చివరకు ఆ పట్టాదారుడు వెంట తెచ్చుకున్న వారే పంచులుగా సంతకాలు చేయడం గమనార్హం. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ బట్టు ప్రేమ్ కుమార్, ఎస్సైలు ఆనంద్ గౌడ్, సుధాకర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story