గోదాముల నిర్మాణంలో తెలంగాణ దేశంలోనే ఫస్ట్.. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

by Disha Web Desk 20 |
గోదాముల నిర్మాణంలో తెలంగాణ దేశంలోనే ఫస్ట్.. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
X

దిశ, ఆర్మూర్ : రైతన్నలు పండించిన పంటలు నిల్వచేసుకోవడానికి వీలుగా ప్రభుత్వం చేపట్టిన గోదాముల నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రధమ స్థానంలో ఉందని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి వెల్లడించారు. ఆలూరు మండల కేంద్రంలో 33 లక్షల 14 వేల రూపాయల వ్యయంతో నిర్మించిన 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాంకు శనివారం జీవన్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా జరిగిన రైతు దినోత్సవ పండగ సందర్భంగా జీవన్ రెడ్డి ఈ గోదాంను ప్రారంభించారు. ఆలూరులో అడుగుపెట్టిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి రైతులు, యువకులు, మహిళలు మంగళ హారతులతో ఘనస్వాగతం పలికారు. ఆలూరు గ్రామశివారు నుంచి ఆలూరు ఊరు వరకు సాగిన జీవన్ రెడ్డి యాత్ర సందర్భంగా ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పట్టారు.

పూలమాలలు, కొబ్బరి మండలతో అలంకరించిన ట్రాక్టర్లతో గ్రామంలో రైతులు జీవన్ రెడ్డిని ఊరేగించారు. "జై కేసీఆర్, దేశ్ కీ నేత కేసీఆర్, జై జీవనన్న, జై తెలంగాణ" నినాదాలతో ఆలూరు గ్రామం మారుమోగింది. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ధాన్యం నిల్వసామర్థ్యం కోటి 20 లక్షల టన్నుల లక్ష్యమన్నారు. 2014కు ముందు ఉన్న గోదాముల్లో ధాన్యం నిల్వసామర్థ్యం కేవలం 39లక్షల టన్నులు మాత్రమేనని ఆయన గుర్తు చేశారు. ఏటేటా రాష్ట్రంలో వ్యవసాయ దిగుబడులు పెరుగు తుండడంతో గోదాముల సామర్థ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం రెట్టింపు చేసిందన్నారు. ఇప్పటికే పెద్దసంఖ్యలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త గోదాములను నిర్మించింది. మరో 40 లక్షల టన్నుల ధాన్యం నిల్వ సామర్థ్యం కోసం కసరత్తు చేస్తోంది. ఈ గోదాముల నిర్మాణం కూడా పూర్తయితే రాష్ట్రంలో ధాన్యం నిల్వ సామర్థ్యం కోటి 20 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా పెరగనుంది.

రాష్ట్రంలో వ్యవసాయ దిగుబడులు ఏటేటా పెరుగుతున్నాయి. దీంతో గోదాముల సామర్థ్యం పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది అన్నారు. ముఖ్యంగా మార్కెటింగ్‌ శాఖ తనగోదాముల సామర్థ్యాన్ని 7.38 లక్షల టన్నుల నుంచి 24.73 లక్షల టన్నులకు పెంచుకుందన్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్‌ గోదాముల్లో ధాన్యం నిల్వ సామర్థ్యాన్ని 2.61 లక్షల టన్నుల నుంచి 7.24 లక్షల టన్నులకు పెంచింది. మార్కెటింగ్‌ శాఖ 40లక్షల టన్నుల ధాన్యం నిల్వ సామర్థ్యానికి గోదాముల నిర్మాణానికి డీపీఆర్‌లను సిద్ధం చేసిందన్నారు. ఈ గోదాముల నిర్మాణం పూర్తయితే రాష్ట్రంలో గోదాముల నిల్వ సామర్థ్యం 1.20కోట్లకు పెరగనుంది. గోదాముల నిల్వ సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నాలతోపాటు పలు సంస్కరణలను ఏకకాలంలో రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్‌ అమలు చేస్తోంది.

ఇది పక్కా రైతు ప్రభుత్వం..

బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితి అన్నారు. రైతుల కోసం ప్రాణమిచ్చే సీఎం కేసీఆర్ అని, కేసీఆర్ పెద్ద రైతు, ఆయనకు తెలియని రైతన్నల బాధలుంటాయా ? రైతులకు మరిన్ని మేలు చేసే కార్యాక్రమాలు త్వరలోనే రానున్నాయి. రైతులకు ఎలాంటి బెంగ వద్దు" అని జీవన్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, ఆలూర్ పీఏసీఎస్ చైర్మన్ కళ్లెం బోజారెడ్డి, ఆర్మూర్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు మూలాకిడి శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ కళ్లెం మోహన్ రెడ్డి, ఎంపీటీసీ మర్కంటి లక్ష్మీ మల్లేష్, వీడీసీ అధ్యక్షులు బార్ల గణపతి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed