రాష్ట్రంలో జరిగిన మార్పులతోనే తెలంగాణకు కీర్తి

by Elthuri vijay kumar |   (  Updated:2025-09-18 02:17:31  IST  )

రాష్ట్రంలో జరిగిన మార్పులతోనే దేశవ్యాప్తంగా తెలంగాణ కీర్తి గాంచిందని తెలంగాణ వ్యవసాయ, రైతుల సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి అన్నారు.

రాష్ట్రంలో జరిగిన మార్పులతోనే తెలంగాణకు కీర్తి
X

రాష్ట్రంలో జరిగిన మార్పులతోనే తెలంగాణకు కీర్తి

- తెలంగాణ సాయుధ పోరాటంతోనే పల్లెల్లో వెట్టిచాకిరికి విముక్తి

-వ్యవసాయ, రైతుల సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి

- కామారెడ్డి కలెక్టరేట్ లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

దిశ, కామారెడ్డి : రాష్ట్రంలో జరిగిన మార్పులతోనే దేశవ్యాప్తంగా తెలంగాణ కీర్తి గాంచిందని తెలంగాణ వ్యవసాయ, రైతుల సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోదండ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట ఫలితంగా అప్పటివరకు పల్లెల్లో నెలకొన్న వెట్టి చాకిరి, భావ వ్యక్తికరణపై ఆంక్షలు, మాతృభాష అణచివేత, మతపరమైన ధోరణులు తొలగి 1948 సెప్టెంబర్ 17 న హైదరాబాద్ సంస్థానం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మారిందన్నారు. తెలంగాణ రాష్ట్రం సుస్థిర ప్రజాపాలనతో సంక్షేమాన్ని పంచుతూ అన్ని మతాలను సమానంగా ఆదరిస్తూ శాంతి సామరస్యాలకు ప్రతీకగా నిలిచిందన్నారు. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తూ పరిశ్రమలకు స్వర్గధామంగా పేరొందిందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసమస్యల పరిష్కారంలో ముందుందని తెలిపారు. కామారెడ్డి జిల్లా వివిధ రంగాల్లో ప్రగతి సాధించిందని తెలిపారు. ఇందిరమ్మ రైతుభరోసా సహాయాన్ని ప్రస్తుత వానకాలంలో 3 లక్షల 3 వేల 568 మంది రైతుల ఖాతాల్లో 305.98 కోట్లు జమచేయడం జరిగిందన్నారు. జిల్లాలో కొత్తగా 16,152 రేషన్ కార్డులు మంజూరు అయ్యాయని, 49,971 మంది కుటుంబ సభ్యులను పాత రేషన్ కార్డులో జతచేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం 2 లక్షల 83 వేల 253 రేషన్ కార్డులకు సెప్టెంబర్ నెలలో 6159 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ జరుగుతుందని తెలిపారు. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి ద్వారా ఈ ఆర్థిక సవత్సరంలో 382.12 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఉచిత బస్సు పథకం ద్వారా ఇప్పటివరకు 5.25 కోట్ల మంది ప్రయాణించారని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు ఉచిత విద్యుత్ పథకం ద్వారా లక్ష 63 వేల 163 వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడం జరుగుతుందని 88.66 కోట్ల రూపాయలను ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు చెల్లించడం జరిగిందన్నారు. జిల్లాలో 11621 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా 6063 ఇండ్ల పనులు ప్రారంభించుకోవడం జరిగిందని, 2663 ఇండ్లు బేస్మిట్, 736 గోడ లెవల్, 306 ఇండ్లు స్లాబ్ వరకు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 2025-26 సంవత్సరానికి 768 చెరువులలో వంద శాతం సబ్సిడీపై 2.83 చేప పిల్లలను విడుదల చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. జిల్లాలోని 4 మున్సిపాలిటీలలో 100 రోజుల కార్యాచరణ ద్వారా శానిటేషన్, సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు, పార్కుల నిర్వహణ లాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. గత నెలలో 27, 28, 29 తేదీలలో అధిక వర్షాలు, వరదలతో జనజీవనం స్తంభించి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం రక్షణ చర్యల్లో నిమగ్నమైందని, తద్వారా ప్రాణనష్టం తక్కువగా జరిగిందని తెలిపారు. ఎన్డిఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అత్యవసర బృందాలు 15 ప్రాంతాలలో 17 రక్షణ చర్యలు 1251 మందిని కాపాడారని చెప్పారు. ముంపు ప్రాంతాలలో 740 కుటుంబాలలోని సభ్యులకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఆహారం, మందులు, ఇతర సౌకర్యాలు అందజేయడం జరిగిందన్నారు. నష్టపోయిన 1737 నివాస గృహాలకు 81.85 లక్షల పరిహారం మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రాణనష్టం జరిగిన ఆరు కుటుంబాలకు సీఎం చేతుల మీదుగా ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల చొప్పున అందజేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 28615 ఎకరాలలో పంటనష్టం జరిగిందని ప్రాథమిక నివేదిక అందించడం జరిగిందని, ఇంకా క్షేత్రస్థాయిలో పరిశీలన కొనసాగుతుందన్నారు. జిల్లాలో వరదల సమయంలో పోలీసు శాఖ అప్రమత్తత, సమన్వయంతో 800 మందికి పైగా రక్షించడం జరిగిందన్నారు. జిల్లాను నేర రహిత జిల్లాగా మార్చేందుకు పోలీసు శాఖ చర్యలతో పాటు ప్రజల సహాయ సహకారాలు అవసరమని తెలిపారు. అంతకుముందు హౌజింగ్ బోర్డు కాలనీలో గల అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ పోరాట అమరులకు కోదండ రెడ్డి, జిల్లా కలెక్టర్, ఎస్పీ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్ నాయక్, ఆర్డీఓ వీణ, కామారెడ్డి సబ్ డివిజన్ ఎఎస్పీ చైతన్య రెడ్డి ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story