దారి మళ్ళితే దండనే.. అధికారులకు స్పీకర్ పోచారం హెచ్చరిక

by Web Desk |
దారి మళ్ళితే దండనే.. అధికారులకు స్పీకర్ పోచారం హెచ్చరిక
X

దిశ, బాన్సువాడ: అనర్హులకు దళితబంధు పథకం అందిస్తే కఠిన చర్యలు తప్పవని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులను హెచ్చరించారు. అర్హులైన దళితులకే దళితబంధు పథకం అందివ్వాలని సూచించారు. బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ తిరుమల దేవస్థానం పరిసరాల్లో సోమవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితబంధు పథకం ప్రపంచానికే ఆదర్శమని కొనియాడారు. దళితుల ఆర్థిక తలరాతను మార్చే శక్తి ఈ పథకానికి మాత్రమే ఉందన్నారు. ఆర్థిక స్వావలంబన సాధ్యమైనప్పుడే నిరుద్యోగిత పారద్రోల పడుతోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల్లోంచి పుట్టిన దళితబంధు పథకం ఆయనకు మానస పుత్రికలాంటిదని చెప్పారు. వందశాతం రాయితీతో పథకం ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణ రాష్ట్రనిదేనని పొగిడారు. విడతలవారీగా అర్హులైన ప్రతీ దళిత కుటుంబానికి పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలు పూర్తి రాయితీతో అందించడం చరిత్రలో నిలుస్తుందన్నారు. సమీక్షలో అధికారులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.



Next Story