విద్యా సంస్థల్లో తెరుచుకున్న దుకాణాలు..

by Disha Web Desk 20 |
విద్యా సంస్థల్లో తెరుచుకున్న దుకాణాలు..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : విద్యా సంవత్సరం ప్రారంభమైందో లేదో ప్రైవేట్ పాఠశాలల్లో ప్రధానంగా కార్పొరేట్ స్కూళ్లలో దోపిడీకి దారులు తెరిచాయి. ప్రధానంగా ప్రభుత్వ ఉత్తర్వులను తుంగలో తొక్కి దోచేస్తున్నారు. జీవోఎం.ఎస్.నంబర్ 01. 1994, జీవో ఎంఎస్ 42(2010) ప్రకారం, జీవోఎంఎస్ నంబర్ 246, జీవోఎంఎస్ నంబర్ 91(2009) ప్రోసిడింగ్ నంబర్ 780(2013) ప్రకారం అమలు చేయాల్సిన నిబంధనలు లేని ప్రైవేట్ పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలలు అమలు చేయడం లేదు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో డిస్ట్రిక్ ఫీ రెగ్యులేషన్ కమిటీ (డీఎఫ్ఆర్ సీ) కమిటీ అనుమతి లేకుండానే ఫీజులను పెంచేశారు.

సీబీఎస్ఈ చట్ట ప్రకారం ప్రతి పాఠశాలలో పేరెంట్, టీచర్ అసోసియేషన్ ఏర్పాటు చేసి అందులో విద్యార్థుల తల్లిదండ్రుల భాగస్వామ్యులను చేసి నిర్ణయించాల్సిన ఫీజులను వారే పెంచేసుకున్నారు. ప్రైవేట్ పాఠశాలల నిర్వాహణలో సమాజాన్ని భాగస్వామ్యం చేయాలన్న నిబంధనలను ఉల్లంగించారు. వన్ టైం ఫీజుగా అప్లికేషన్ రూ.100గా రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.500, రిఫండబుల్ కాషన్ డిపాజిట్ గా రూ.5 వేలకు మించకుండా ఫీజు తీసుకోవాల్సి ఉండగా నిబంధనలన్ని ఉల్లంఘించి వేల రూపాయల ఫీజులను వసూల్ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో వందల సంఖ్యలో ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. కార్పొరేట్ విద్యా సంస్థలుగా శ్రీ చైతన్య, నారాయణ, ఎస్.ఆర్ లాంటి కార్పొరేట్ పాఠశాలలున్నాయి. సెంట్రల్ బోర్డు సెకండరీ ఎడ్యుకేషన్ విద్యా సంస్థలు ప్రైవేట్ లోను ఏర్పాటు చేశారు.

నిజామాబాద్ జిల్లాలో 6 ఉన్నాయి. ప్రైవేట్ పాఠశాలలు ఏర్పాటు సందర్భంగా ఉన్న నిబంధనలు ఏవి అమలు చేయడం లేదు. పక్కా కమర్షియల్ అన్న చందంగా విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంగిస్తూ పాఠశాలలను నడుపుతున్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ విద్యా సంవత్సరం నారాయణ విద్యా సంస్థలు ప్రారంభించారు. రెండు, మూడేళ్ళ క్రితమే శ్రీ చైతన్య పాఠశాలలు ఏర్పాటయ్యాయి. ఎస్.ఆర్. విద్యా సంస్థలు బ్రాంచ్ ల చొప్పున పెరిగిపోయాయి. ఆయా విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల కష్టాలు అన్నీఇన్నీ కావు. కార్పొరేట్ విద్యా సంగతి ఏమో కానీ యూనిపాం, టై, బెల్టులతో పాటు పుస్తకాలు కూడా అందులోనే కొనుగోలు చేయాలన్న నిబంధనలు అమలు చేస్తున్నారు. ప్రైమరీ విద్యార్థికి ఫీజు మొదలుకుని ఇతర సామాగ్రికి, కొనుగోళ్ళకు వసూల్ చేస్తున్న ఫీజులు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.

జీవో ఎంఎస్ నంబర్ 91 ప్రకారం ఫీజుల వసూలు జరుగడం లేదు. జీవో ఎంఎస్ 246 ప్రకారం ప్రైవేట్ పాఠశాలల నిర్వహణలో సమాజాన్ని భాగస్వామ్యం చేయాలన్న అంశాన్ని తుంగలో తొక్కారు. ప్రోసిడింగ్ 780(2013) సెక్షన్ 8(1) ప్రకారం పాఠశాలల బోర్డులపై ఇంటర్నేషనల్, ఐఐఐటి, ఒలింపియాడ్, కాన్సెప్ట్, ఈ టెక్నో అనే తోక లేవి తగించరాదన్న నిబంధనలు పాటించడం లేదు. జీవోఎంఎస్ సెక్షన్ 1(సి) ప్రకారం పాఠ్యపుస్తకాలు, స్టేషనరి, యూనిఫాంలను స్కూల్ యజమాన్యం సూచించే ఫలాన చోటునే కొనాలన్న ఖచ్చితమైన నిబంధనలేమి పెట్టరాదని చట్టం చెబుతున్నా అవేమి అమలు చేయడం లేదు. 2010 తర్వాత ప్రైవేట్ స్కూల్ ఫీజులు పెంచాలని డిస్ట్రిక్ ఫీ రెగ్యులేషన్ కమిటీ అనుమతులు లేకుండానే యజమాన్యాలు ఇష్టారీతిన ఫీజులను పెంచారు.

అడ్మిషన్ ఫీజుతో పాటు డొనేషన్లు కూడా కట్టించుకుంటున్న అడిగే నాథుడు లేడు. జీవోఎంఎస్ నంబర్ 1 ప్రకారం పాఠశాలలు 5 శాతానికి తగ్గకుండా మాత్రమే లాభాలు ఆశించాల్సి ఉండగా వసూల్ చేసిన ఫీజుల్లో 50 శాతం మొత్తాన్ని ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించాల్సి ఉండగా ఆ నిబంధనలు ఏమి అమలు చేయడం లేదు. ప్రధానంగా ఫీజుల గురించి బోర్డులపై ప్రదర్శించాల్సి ఉండగా ఏ ఒక్క ప్రైవేట్ పాఠశాల దానిని అమలు చేయడం లేదు. విద్యాశాఖాధికారులు నామమాత్రంగా పత్రిక ప్రకటనలు విడుదలకే పరిమితమయ్యారు. ప్రైవేట్ పాఠశాలల్లో జరుగుతున్న ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘనను గురించి పట్టించుకునే వారే లేరు. ఎంఈవోల కొరత సాకుగా చూపెట్టి ప్రైవేట్ పాఠశాలలను, కార్పొరేట్ పాఠశాలలను దోపిడికి ఊతమిస్తున్నారని వాదనలు ఉన్నాయి.

Next Story

Most Viewed