నో ఫైర్ సెఫ్టీ.. పట్టించుకోని అధికారులు

by Disha Web Desk 20 |
నో ఫైర్ సెఫ్టీ.. పట్టించుకోని అధికారులు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : దీపావళి పండుగ సందర్భంగా పెద్దఎత్తున టపాకాయల విక్రయాలు షురూ అయ్యాయి. అగ్నిమాపక శాఖ అనుమతి లేకుండానే టపాకాయల దుకాణాలను ఏర్పాటు చేశారు. దసరా తర్వాత దీపావళి పండుగను ఘనంగా నిర్వహిస్తారు. ఉత్తరాధి కల్చర్ ఆనవాళమైన పటాకులను కాల్చే పద్దతి ఉమ్మడి జిల్లాలో జోరుగా జరుగుతుంది. కోట్లలో టపాకాయల వ్యాపారం జరుగుతుంది. ప్రతియేటా అగ్నిమాపక శాఖ పటాకులు విక్రయించడానికి అనుమతులు తీసుకోవాలని నోటిఫికేషన్ జారీ చేస్తుంది.

కానీ చాలా మంది అవేమి పట్టించుకోకుండానే విక్రయాలు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఆర్మూర్, బోధన్, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద లాంటి ప్రాంతాల్లో పటాకుల విక్రయాలు జోరుగా జరుగుతాయి. నిజామాబాద్ జిల్లాకు కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులు ఉండడంతో తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున టపాకాయలను తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న హోల్ సెల్ విక్రయదారులు జీఎస్టీ చెల్లించి విక్రయాలు చేస్తుండగా వారి ద్వారా కొనుగోలు చేసిన పటాకులను రిటేల్ గా విక్రయిస్తున్నారు. హోల్ సెల్ వ్యాపారులు జీఎస్టీ చూయిస్తుండగా మిగిలిన రిటేల్ వ్యాపారులు తమ వ్యాపారం 20 లక్షలలోపే అని జీరోలోనే వాటిని క్రయవిక్రయాలు చేస్తున్నారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు కామారెడ్డి జిల్లా కేంద్రంలో హోల్ సెల్ పటాకుల వ్యాపారం జరుగుతుంది. ఐదారుగురు వ్యాపారులు మాత్రమే ఈ దందాలో చాలా ఏళ్ళ నుంచి కొనసాగుతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన జీఎస్టీ కారణంగా సబ్ డీలర్ల మాదిరిగా వందల మంది విక్రయాలు చేస్తున్నారు. పటాకుల నిలువ విక్రయాలకు అగ్నిమాపక శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉండగా ఉమ్మడి జిల్లాలో పర్మిట్ల సంఖ్య వందలోపు మాత్రమే ఉంది.

వందల మంది రిటేల్ గా విక్రయాలు జరుగుతున్న వారు వ్యాపారాన్ని జీరోలో చూపుతుండడంతో వాటికి అగ్నిమాపక శాఖ అనుమతులు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పండుగకు 48 గంటలు మాత్రమే ఉండగా ఇప్పటి వరకు అగ్నిమాపక శాఖ మాత్రం క్షేత్రస్థాయికి వెళ్లింది లేదు. ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లను తనిఖీలు చేసింది లేదన్న చందంగా ఉంది పరిస్థితి. అగ్నిమాపక శాఖ అనుమతి ఇవ్వకపోయినా పోలీసు శాఖ సైతం కచ్చితంగా పటాకుల దుకాణాల ఏర్పాటుకు అనుమతి తీసుకోవాలని కోరింది. ఆన్ లైన్ ద్వారా కావడంతో చాలా మంది దరఖాస్తులు చేసుకున్నట్లు సమాచారం.

పటాకుల ధరలు మార్కెట్లో భగ్గుమంటున్నాయి. ఏది కొందమన్నా వందలు, వేలు ఉండగా వ్యాపారులు మాత్రం జీరోలో దందాను నిర్వహిస్తూ ప్రభుత్వానికి పన్నులను ఎగవేస్తున్నారు. చిన్న రిటైల్ లోనే లక్షల సామాగ్రి ఉండగా వాటిని కూడా రూ.20 లక్షల లోపు చూపడం గమనార్హం. ఈ విషయంలో జీఎస్టీ అధికారులతో హోల్ సెల్ వ్యాపారుల ములాఖత్ ఉందనే చర్చ జరుగుతుంది. అసోసియేషన్ తరపున ప్రతి షాప్ కు వసూల్ చేసి ఫైర్, జీఎస్టీ అధికారులను మేనేజ్ చేస్తామని బహిరంగంగా చెబుతున్నారు.

ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేకుండానే జనావాసాల మధ్య పటాకుల విక్రయాలు చేస్తుండడంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అంతేగాకుండా ఫైర్ సేఫ్టీ పర్మిషన్ లేకుండా ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. జీఎస్టీ లేకుండానే జీరోలో పటాకులు విక్రయాలు జరుగడం ద్వారా కేంద్రానికి రావాల్సిన పన్నులకు ఎగనామం పెడుతున్నారు. పన్నులు విషయంలో అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు కనిపించడం లేదు. పకడ్బందీగా పథకం ప్రకారం ఈ తంతు జరుగుతున్న అధికార యంత్రాంగం చూసి చూడనట్లు వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. హోల్ సెల్ వ్యాపారుల అసోసియేషన్ కనుసన్నుల్లో పటాకుల వ్యాపారం జరుగుతున్నా ఇప్పటి వరకు కేసులు నమోదు చేయలేదంటే అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.

Next Story