రైతులపై దాడి చేసిన రైస్ మిల్లర్లు

by Disha Web Desk 1 |
రైతులపై దాడి చేసిన రైస్ మిల్లర్లు
X

తరుగు ఎక్కువగా తీస్తున్నారని ప్రశ్నించింనందుకు దాడి

దిశ, పిట్లం : మండల పరిధిలోని కుర్తి గ్రామ శివారులో వైష్ణవి రైస్ మిల్లర్ల ఆగడాలకు అడ్డు, అదుపు లేకుండా పోయింది. నిజాంసాగర్ మండలం నర్సింగ్ రావు పల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ సాయిలు, రామ్ రెడ్డి అనే రైతులు, మరో రైతుపై రైస్ మిల్లర్ల యాజమాన్యం దాడికి పాల్పడ్డారు. నర్సింగ్ రావు పల్లి గ్రామంలో కొనుగోలు కేంద్రంలోని వడ్లను పిట్లం మండలంలోని కుర్తి గ్రామంలో ఉన్న వైష్ణవి రైస్ మిల్లుకు అలాట్ చేశారు. ధాన్యం లోడ్ అయిన తర్వాత లారీల ద్వారా వైష్ణవి రైసు మిల్లుకు తరలించారు.

యాజమాన్యం వచ్చిన లారీలో నాలుగు, ఐదు కిలోల చొప్పున తరుగును తీస్తున్నారని రైతులు ఆవేదన చెందారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ సాయిలుతో పాటు మరో ఐదుగురు రైతులు వైష్ణవి మిల్లుకు వచ్చారు. యజమానితో రైతులు వాగ్వాదానికి దిగడంతో మిల్లర్లు రైతులను చితకబాదారు. సుమారు ఐదు గంటల పాటు రైతులను రైస్ మిల్లులోనే నిర్బంధించారు. పోలీసులు వచ్చేంత వరకు కూడా వారిని విడిచి పెట్టలేదు. మొత్తం 761 బస్తాలతో లారీ లోడు వచ్చిందని, అందులో 57 బస్తాల తరుగుగా ఎందుకు తీస్తున్నారని సర్పంచి ప్రశ్నించారు. ఇద్దరి మధ్య మాట పెరిగి దాడికి పాల్పడ్డారు. రైతు రాంరెడ్డిని తీవ్రంగా కొట్టారు. సర్పంచ్ సాయిలు ను చికిత్స నిమిత్తం పిట్లం ప్రభుత్వాసుపత్రికి తీసుకోచ్చారు.



Next Story

Most Viewed