మున్సిపల్ అభివృద్ధి పై బహిరంగ చర్చకు సిద్ధమా..?

by Web Desk |
మున్సిపల్ అభివృద్ధి పై బహిరంగ చర్చకు సిద్ధమా..?
X

దిశ, కామారెడ్డి: గత 30 సంవత్సరాల మున్సిపల్ చరిత్రలో జరగని అభివృద్ధి గడచిన రెండేళ్లలో జరిగిందని, మున్సిపాలిటీ అభివృద్ధి పై ప్రజల సమక్షంలో బహిరంగ చర్చకు రావాలని బీజేపీ కౌన్సిలర్ లకు టీఆర్ఎస్ కౌన్సిలర్లు సవాల్ విసిరారు. శనివారం కామారెడ్డి పట్టణంలోని ఆర్.అండ్.బి గెస్ట్ హౌస్ లో మున్సిపల్ టీఆర్ఎస్ కౌన్సిలర్లు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కామారెడ్డి మున్సిపల్ సర్వసభ్య సమావేశానికి కోవిడ్ కారణంగానే టెలి కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించడం జరిగిందన్నారు. విజిలెన్స్ దాడులపై బీజేపీ కౌన్సిలర్లు ప్రశ్నిస్తారన్న భయంతో మాత్రం కాదన్నారు. విజిలెన్స్ దాడులు గత పాలకవర్గం హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై జరిగాయన్నారు.

ప్రస్తుత పాలకవర్గ హయాంలో జరిగిన దానిపై కాదని తెలిపారు. కామారెడ్డి మున్సిపాలిటీ సుమారు 50 నుంచి 60 కోట్లతో అభివృద్ధి చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఇటీవల కలెక్టరేట్ ప్రారంభోత్సవం కార్యక్రమానికి సీఎం కేసీఆర్ వచ్చినప్పుడు మున్సిపల్ అభివృద్ధికి 50 కోట్లు కేటాయించారని చెప్పారు. ఆ 50 కోట్లతో పనులు చేపట్టడానికి వచ్చిన వారిని బీజేపీ కౌన్సిలర్లు బెదిరింపులకు గురి చేసారని ఆరోపించారు. సిరిసిల్ల రహదారి వెడల్పు కోసం నాలుగు కోట్లు కేటాయించడం జరిగిందని, కోవిడ్, వర్షాల కారణంగా పనులు ఆలస్యం జరిగితే ఆరు నెలల క్రితం గుంతలలో కూర్చుని బీజేపీ నాయకులు నిరసన తెలిపారన్నారు. రెండు నెలల్లో రోడ్డు పనులు పూర్తి చేస్తే ప్రజలు ప్రశంసించారని, ఆపాటి కనీస జ్ఞానం బీజేపీ కౌన్సిలర్ లకు లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులలో టీఆర్ఎస్ కౌన్సిలర్ల కన్నా బీజేపీ కౌన్సిలర్లకే అధిక నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు.

కామారెడ్డి మున్సిపల్ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ కౌన్సిలర్లు ఇలాంటి అవాకులు చెవాకులు పేలుతున్నారని, వీటికి టీఆర్ఎస్ కౌన్సిలర్లు బెదరబోరని చెప్పారు. సమావేశం ఏ విధంగా జరిగినా ప్రశ్నించే అవకాశం ఉందని, సమస్యలు వివరించవచ్చన్నారు. మున్సిపల్ అభివృద్ధి, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల వార్డులలో జరిగిన అభివృద్ధిపై తాము చర్చకు సిద్ధమని, ప్రజల సమక్షంలో తేల్చుకోవడానికి బీజేపీ కౌన్సిలర్లు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. ఎప్పుడు, ఎక్కడ చర్చ నిర్వహించాలో బీజేపీ కౌన్సిలర్లే చెప్పాలని సూచించారు. అభివృద్ధి పై ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు కారంగుల అంజల్ రెడ్డి, కాసర్ల స్వామి, నజీరుద్దీన్, శంకర్ రావు, కృష్ణాజిరావు, కన్నయ్య, చాట్ల వంశీకృష్ణ, భాస్కర్ గౌడ్, రాజు ఇతర కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Next Story

Most Viewed