జీతాలు ఇవ్వరు.. క‌మీష‌న్లు రావు..!

by Nallavelli.Anjaneyulu |

దిశ, ఆలూర్ : రేషన్‌ డీలర్లకు జీతాలు ఇవ్వం...కమీషన్‌ ఇస్తామని చెప్పి ఆరు నెలలుగా రేషన్‌ డీలర్ల కమీషన్‌ లు ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారిని ముప్పు

జీతాలు ఇవ్వరు..  క‌మీష‌న్లు రావు..!
X

దిశ, ఆలూర్ : రేషన్‌ డీలర్లకు జీతాలు ఇవ్వం...కమీషన్‌ ఇస్తామని చెప్పి ఆరు నెలలుగా రేషన్‌ డీలర్ల కమీషన్‌ లు ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారిని ముప్పు తిప్పలు పెడుతున్నారు. వారికి రావాల్సిన కమీషన్‌ ల బకాయిలును దీపావళికి తప్ప కుండా కమీషన్‌ అందుతుందని నమ్మ బలికి ఆశ పెట్టిన సివిల్‌ సప్లె ఉన్నతాధికారులు పండుగ దగ్గర పడుతున్న తర్వాత ఇప్పట్లో మీ కమీషన్లు రావని చేతులు ఎత్తేశారు. పండగ పూట కూడా మాపై దయలేదా.. కమీషన్లు ఇవ్వరా ఎట్లా బతికేది,మా కుటుంబాలను ఎలా పోసించేదని రేషన్‌ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం తీరుపై మండిపడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్‌ డీలర్లు త్వరలో నిరవధిక సమ్మెకు సిద్ధం అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

నిజామాబాదు జిల్లాలో..

ప్రజా పంపిణీ పథకం కింద పేదలకు రేషన్‌ బియ్యం పంపిణీ చేస్తున్న డీలర్లు కమీషన్‌ డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు.ఆరు నెలలుగా కమీషన్‌ డబ్బులు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని డీలర్లకు ఆరు నెలలకు సంబంధించి రూ.3 కోట్లకు పైనే బకాయిలు పేరుకుపోయాయి.జిల్లాలో 759 రేషన్‌దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా 4,47,788 వరకు కార్డు దారులకు బియ్యం పంపిణీ అవుతోంది. ప్రతినెలా సుమారు "7650 మెట్రిక్‌ టన్నుల బియ్యం డీలర్లు పంపిణీ చేస్తున్నారు.చౌకధరల దుకాణాల్లో ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. కిలో బియ్యానికి రూ.1.40 చొప్పున, క్వింటాలుకు రూ.140 కమీషన్ చెల్లిస్తుంది. ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డుల పంపిణీ, సభ్యుల చేరికతో గత మూడు నెలల నుంచి అన్ని దుకాణాల్లో బియ్యం కోటా పెరిగింది.మార్చి వరకు సజావుగా కమీషన్‌ డబ్బులు జమ చేసిన ప్రభుత్వం.. ఇటీవల ఏప్రిల్‌ కమీషన్‌ జమ చేసింది. మే నుంచి సెప్టెంబర్‌ వరకు బకాయిలు పేరుకుపోయాయి. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త నిబంధనల ప్రకారం వేర్వేరుగా కమీషన్‌ జమ చేస్తుండటంతో డీలర్లు అయోమయ పరిస్థితిలో ఉన్నారు.

ఇబ్బందుల్లో రేష‌న్ డీల‌ర్లు..

రేషన్‌ డీలర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఆరు నెలలుగా కమీషన్‌ డబ్బులు జమ కాకపోవడంతో డీలర్లు అప్పుల పాలవుతున్నారని వాపోతున్నారు.దుకాణాల అద్దె, బియ్యం సరఫరా కోసం అవసరమైన సిబ్బంది జీతాలు, ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి లారీల్లో సరఫరా చేసిన హమాలీల చెల్లింపులు, ఇతర నిర్వహణ ఖర్చులు భరించడం కష్టంగా మారిందని తెలిపారు. ప్రభుత్వం మే నెల కమీషన్‌ ఇప్పటివరకు పెండింగ్‌లో ఉంచడమే కాకుండా, జూన్‌, జూలై, ఆగస్ట్‌ నెలల బియ్యం వర్షాల కారణంగా ఒకేసారి జూన్‌లోనే సరఫరా చేయడంతో భారీ ఖర్చులు వచ్చినట్లు చెప్పారు. ఈ ఆరు నెలల కమీషన్‌ బకాయిలు ఇంకా జమ కాలేదని, తక్షణమే వాటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డీలర్లు కోరుతున్నారు.

నిరవధిక సమ్మె దిశగా...

రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌ లో పెట్టిన రేషన్‌ డీలర్ల కమీషన్ల బకాయిల విడుదలతో పాటు దీర్ద కాలికంగా పెండింగ్‌ లో ఉన్న ఇతర సమస్యల సాధనకు రేషన్‌ డీలర్లు అందరూ నిరవధిక సమ్మెకు త్వరలో దిగబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం.కాగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయడానికి రేషన్‌ డీలర్లు సంఘం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని, త్వరలోనే ప్రభుత్వానికి ఇచ్చే సమ్మె నోటీస్‌ కు సంబంధించిన డేట్‌ నిర్ణయించడమే తరువాయని డీలర్లు చెప్పడం విశేషం. ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్ల జీతాలు కూడా మూడు నెలలుగా పెండింగ్లో ఉన్నట్లు వారూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Next Story