మంత్రి సారూ మా గోడు వినండి..

by Disha Web Desk 20 |
మంత్రి సారూ మా గోడు వినండి..
X

దిశ, నిజామాబాద్ సిటీ : వేల్పూర్ మండలం రామన్న పేట్ గ్రామంలోని కుంట కింది సంఘం, గడ్డం సంఘం, బొమ్మ సంఘం, ఈర్ల ముదిరాజ్ సంఘసభ్యులను 300 మందిని వీడీసీ సంఘ బహిష్కరణ చేసారంటూ నగరంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు లింబాద్రి, రుక్మిణిలు మాట్లాడుతూ రామన్నపేట గ్రామంలోని కప్పల వాగు నుంచి సంగేమ్ కిషన్ తండ్రి రాజన్న అనే వ్యక్తి ఇసుకను అక్రమంగా జేసీబీతో లోడింగ్ చేస్తూ, ట్రాక్టర్లు టిప్పర్లతో పాటు భారీ వాహనాలతో తరలిస్తున్నారని అన్నారు. రాత్రివేళ్లలో ఇసుక రవాణా చేసే పెద్దపెద్ద వాహనాలు నడపడం వల్ల రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదని, పంట పొలాలు తోటలకు వెళ్లి రాత్రిళ్ళు కరెంటు మోటార్ల దగ్గరికి వెళ్లి తిరిగి వస్తుండగా ఇసుక తరలిస్తున్న వాహనాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ముదిరాజ్ లు నివసించే గల్లీ నుంచి ఇసుకను తరలించవద్దని వీడీసీ వారికి విన్నవించగా ముదిరాజ్ కులస్తులను గ్రామ బహిష్కరణ చేశారని వాపోయారు.

గ్రామంలో తమకు ఎలాంటి సదుపాయాలు కల్పించకుండా కిరణా షాప్, నిత్యావసర వస్తువులు ఏమి కొనుక్కోనివ్వడం లేదని, గ్రామంలో తమకు ఏ వస్తువులు అమ్మడం లేదని అన్నారు. కిరాయి ఉన్న ఇళ్లలో నుంచి ఒకటో తేదీ వరకు ఖాలీ చేయాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. విద్యార్థులను స్కూల్ కు పంపిస్తే అక్కడ ఇతర కులస్తులు విద్యార్థులతో మాట్లాడినివ్వకుండా అడ్డుకుంటున్నారన్నార. వివిధ కులవృత్తుల వారి నుంచి తమకు ఎలాంటి సహాయం అందకుండా ఒత్తిడి చేస్తున్నారన్నారు. ఎవరైనా తమతో మాట్లాడినా, ఆపదలో ఆదుకున్నా లక్ష జరిమానా అంటూ బయపెడుతున్నారని అన్నారు. జిల్లా కలెక్టర్, ఎస్సై, సీఐ, సర్పంచ్, ఎంపీటీసీలకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. జిల్లా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరారు. ప్రెస్ మీట్ లో పందేన తిరుపతి, జాగర్ల గంగాధర్, గడ్డం శ్రీనివాస్, జాగర్ల నర్సయ్య, జాగర్ల గణేష్, పొన్నాల చిన్నయ్య, గడ్డం రాజమని, జంగడి గంగా నర్సు, మర్రి కవిత, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed