హాలీవుడ్ ను తలపించిన నాగిరెడ్డిపేట్ పోలీసుల మిడ్‌నైట్ చేజింగ్

by Nallavelli.Anjaneyulu |

నాగిరెడ్డి పేట్ పోలీసుల మిడ్ నైట్ ఛేజింగ్ హాలీవుడ్ మూవీని త‌ల‌పించింది.

హాలీవుడ్ ను తలపించిన నాగిరెడ్డిపేట్ పోలీసుల మిడ్‌నైట్ చేజింగ్
X

దిశ, లింగంపేట : నాగిరెడ్డి పేట్ పోలీసుల మిడ్ నైట్ ఛేజింగ్ హాలీవుడ్ మూవీని త‌ల‌పించింది. నాగిరెడ్డిపేట్ మండ‌లంలోని గోపాల‌పేట గ్రామానికి చెందిన మ‌హ‌మ్మ‌ద్ స‌పుద్దిన్ (42) ఈనెల 02న TS17T0997 నెంబ‌ర్ గ‌ల ఆటోను ఎల్లారెడ్డికి కిరాయికి వెళ్లి రాత్రి 9 గంట‌ల‌కు ఇంటికి వ‌చ్చాడు. ఇంట్లో పార్కు చేసి ప‌డుకోగానే.. తెల్ల‌వారుజామున అనగా ఈనెల 03న ఆటో క‌నిపించ‌లేదు. గుర్తు తెలియ‌ని దుండ‌గులు ఆటో దొంగిలించార‌ని నాగిరెడ్డిపేట్ పోలీస్ స్టేష‌న్ లో కేసు న‌మోదైంది. గోపాల్‌పేట్ బస్టాండ్ సమీపంలో విధులు నిర్వహిస్తున్న బ్లూ కోల్ట్స్ సిబ్బంది సుమారు రాత్రి 2:30 గంటల సమయంలో, రెండు మోటార్‌సైకిళ్లపై అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను గమనించారు. వారిని ప్రశ్నించేందుకు ప్రయత్నించగా, ఒక బైక్‌ను అక్కడే వదిలివేసి ఇద్దరు వ్యక్తులు మరో బైక్‌పై వేగంగా పరారయ్యారు. వెంటనే బ్లూ కోల్ట్స్ సిబ్బంది పెట్రో కార్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పెట్రో కార్ సిబ్బంది సురేష్, సుదర్శన్ తమ వాహనంతో అనుమానితుల వెంట పడ్డారు. చీకటిని చీల్చుకుంటూ రహదారులపై సాగిన ఈ చేజింగ్‌లో ప్రతి క్షణం ఉత్కంఠభరితంగా మారింది.

పోచారం సమీపంలో పెట్రో కార్‌ను అడ్డంగా ఉంచి నిందితుల బైక్‌ను ఆపే ప్రయత్నం చేసినప్పటికీ, వారు చాకచక్యంగా తప్పించుకుని ఎల్లారెడ్డి వైపు దూసుకెళ్లారు. అయితే పోలీసులు వెనుకడుగు వేయలేదు. వెంటనే నాగిరెడ్డిపేట్ ఎస్‌ఐకి సమాచారం అందగా, ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. దీంతో ఆపరేషన్ మరింత వేగం పుంజుకుంది. పోలీసుల వేట మరింత ఉధృతం కావడంతో మాల్తుమ్మెద గ్రామ గేటు వద్దకు చేరుకున్న నిందితులు తమ బైక్‌ను అక్కడే వదిలేసి పొలాల వైపు పరుగులు తీశారు. అప్పటికే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించనీయకూడదని పోలీసులు నిర్ణయించుకున్నారు. మాల్తుమ్మెద ఉపసర్పంచ్‌కు సమాచారం అందించగా, ఆయన క్షణాల్లో గ్రామస్తులను అప్రమత్తం చేశారు. రాత్రి 3 గంటల సమయంలోనే గ్రామ యువకులు, గ్రామస్తులు పోలీసులతో కలిసి గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. చీకటిని చీల్చుకుంటూ టార్చ్‌లైట్ల వెలుగుల్లో సాగిన ఈ ఆపరేషన్ సినిమా సన్నివేశాలను తలపించింది. పోలీసులు, గ్రామస్తుల ఒత్తిడిని తట్టుకోలేక నిందితులు పోచారం వైపు చేరుకున్నారు. తాము చిక్కుకుపోతున్నామని గ్రహించిన ఇద్దరు నిందితులు తమ గ్యాంగ్‌లోని మరో ముగ్గురికి ఫోన్ చేసి లొకేషన్ పంపారు. వెంటనే ఆ ముగ్గురు దొంగిలించిన ఆటోలో పోచారం చెరువు కట్ట ప్రాంతానికి చేరుకుని తమ సహచరులను తప్పించేందుకు ప్రయత్నించారు. అయితే వారి ప్రణాళిక కూడా విఫలమైంది. బ్లూ కోల్ట్స్ సిబ్బంది వారి కదలికలను గుర్తించి వెంటాడడంతో, వారు ఆటోను అక్కడే వదిలేసి పొలాల వైపు పరుగులు తీశారు. అప్పటికే ఆపరేషన్ మరింత విస్తరించింది. ఒకవైపు పోలీసులు, మరోవైపు బ్లూ కోల్ట్స్, పెట్రో కార్ సిబ్బంది, మాల్తుమ్మెద ఉపసర్పంచ్, గ్రామస్తులు పోచారం యువకులు, గ్రామస్తులు కలిసి ఐదుగురు అనుమానితుల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు.

పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన నాగిరెడ్డిపేట్ ఎస్‌ఐ, మెదక్ జిల్లా జక్కన్నపేట సర్పంచ్‌కు సమాచారం అందించారు. దీంతో ఆయన గ్రామస్తులతో కలిసి గ్రామ ప్రవేశ మార్గాల వద్ద అప్రమత్తంగా మోహరించారు. వెనుక నుంచి పోలీసులు, గ్రామస్తులు వదలకుండా వెంబడిస్తుండగా, ముందువైపు జక్కన్నపేట గ్రామస్తులు, నాగిరెడ్డిపేట్ ఎస్‌ఐ మరియు పోలీసు సిబ్బంది సిద్ధంగా ఉండటంతో నిందితులు అక్కడి నుండి తప్పించుకొని పోచారం వైపు రాగా వాహన తనికి చేస్తున్న పోలీసులు నలుగురు అనుమానితులను చాకచక్యంగా పట్టుకున్నారు. వీరిలో ఏ1 చింత బాల‌రాజు పై 43 కేసుఉన్నాయి. ఏ2 షేక్ ఫ‌య్యీజ్ 37 కేసుల చ‌రిత్ర‌, కీర్తీక్ రెడ్డి 3 కేసులు, ర‌మేష్ 1 కేసుతో సీసీఎల్ 3 కేసులు ఉన్నాయి.

Next Story