బీఎస్పీ నేతల దాడిలో కుప్పకూలిన బీఆర్ఎస్ నేత..

by Disha Web Desk 20 |
బీఎస్పీ నేతల దాడిలో కుప్పకూలిన బీఆర్ఎస్ నేత..
X

దిశ, భిక్కనూరు : నోటి దురదతో అన్న మాటలు... చిలికి చిలికి గాలి వానలా మారి, నేతల మధ్య మాటమాట పెరిగి గల్లలు పట్టుకొని బట్టలు చిరిగేలా తన్నుకోవడం, రాళ్లతో పరస్పరదాడులకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. ఈ సంఘటన భిక్కనూరు మండల కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పూర్తి వివరాల ప్రకారం బీఎస్పీ నేతలైన ఇద్దరు అన్నదమ్ములు తమ పెంపుడు కుక్కను వెంటబెట్టుకొని అర్ధరాత్రి 12 గంటల సమయంలో చెమాన్ లో ఉన్న క్లబ్బుల వైపు వాకింగ్ కు వెళ్లారు. అదే సమయంలో పెళ్లి బరాత్ జరుగుతుండడంతో స్నేహితులతో కలసి ఓ పిల్లాడు ఎంజాయ్ చేస్తున్నాడు. ఇవేమీ పనులు రా ఫ్యామిలీస్ ఉండే చోట వద్దు, ఇక్కడి నుంచి దూరంగా వెళ్లాలని బెదిరించాడు. దీంతో ఆ పిల్లవాడు బీఎస్పీ నేతలతో నువ్వు నాకేంది చెప్పేదంటూ ఎదురు తిరిగి తనతండ్రికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు.

వెంటనే అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ పార్టీనేత ఏదైనా ఉంటే తనతో మాట్లాడాలి గాని అనవసరమైన మాటలు పిల్లలతో ఎందుకు మాట్లాడుతున్నావ్ అంటూ బీఎస్పీ నేతతో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిరే సమయంలో ఈ విషయం తెలుసుకున్న స్థానిక ప్రజాప్రతినిదితో పాటు, బీఆర్ఎస్ పార్టీ నేతలు కొందరు అదే సమయంలో అక్కడికి చేరుకోవడం, అప్పటివరకు కామ్ గా ఉన్న ఆ నేత, బీఎస్పీ నేత చెంప చెల్లుమనిపించాడు. దీంతో ఇరువురు కుస్తీలు పట్టుకొని తన్నుకోవడం గల్లాలు పట్టుకొని ఒకరినిఒకరు తో సేసుకున్నారు. బీఎస్పీ నేతలు తమ పై దాడులు చేసేందుకు వచ్చిన ప్రజాప్రతినిధులను బలంగా క్లబ్ గేటు పైకి తోసేయడం, మరో నేతను గల్లా పట్టి కిందేసి బట్టలు చిరిగేలా కొట్టడంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా రణరంగంగ మారింది. అడ్డు వచ్చిన మరో నేతను కాలుతో తన్నడంతో రోడ్డు పై కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.

ఉలుకుపలుకు లేకుండా పడిపోవడం, ఘటనలో పలువురు బీఆర్ఎస్ నేతలు గాయపడడంతో కోపోద్రిక్తులైన నేతలు పక్కనే ఉన్న రాళ్ల కుప్ప నుంచి రాళ్లు విసురుతూ పరస్పర దాడికి దిగడంతో బీఎస్పీ నేత భయపడిపోయి వారి బారీ నుంచి తప్పించుకొని రక్షణకోసం పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించగా, ఆయన సోదరుడు వారి కళ్ళు గప్పి పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళ అన్నయ్య ఇంట్లోకి వెళ్లి దర్వాజాలు పెట్టుకొని గడియ వేసుకున్నాడు. జరుగుతున్న దాడి విషయాన్ని బీఎస్పీ నేత 100కు డయల్ చేసి ఫిర్యాదు చేశాడు. వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ శాంతించని నేతలు కొందరు బీఎస్పీ నేత ఇంటి గేటు తన్నుకుంటూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. వారి కార్లను రాళ్లు కర్రలతో ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపుతప్పడంతో సర్కిల్ పరిధిలోని పోలీసులను రప్పించి పరిస్థితి చక్కదిద్దారు. బీఆర్ఎస్, బీఎస్పీ నేతలిరువురు గురువారం పోలీస్ స్టేషన్ కు చేరుకొని పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు.

ఆ ఇద్దరి వల్లే... చెదిరిన ప్రశాంతత...?

ఆ ఇద్దరు అన్నదమ్ముల వ్యవహార శైలి సరిగా లేకపోవడం వల్లే భిక్కనూరులో ప్రశాంత వాతావరణం చెదిరిపోయిందన్న వాదన వినిపిస్తోంది. ఇన్నేళ్ల చరిత్రలో ఎప్పుడు జరగని గొడవలు వారిద్దరూ పట్టణంలో అడుగుపెట్టాకే జరుగుతున్నాయన్న ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.


Next Story

Most Viewed