ఎల్లారెడ్డి ప్రజలకు గుడ్ న్యూస్

by Dishanational1 |
ఎల్లారెడ్డి ప్రజలకు గుడ్ న్యూస్
X

దిశ, నాగిరెడ్డిపేట్(ఎల్లారెడ్డి): కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న రోగులు ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. బుధవారం ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కోటి 50 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని ఎమ్మెల్యే జాజాల సురేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న రోగులకు డయాలసిస్ కేంద్రం లేకపోవడంతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, మంత్రి హరీష్ రావు వెంటనే స్పందించి డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు నిధులు మంజూరు చేశారన్నారు.

అలాగే 100 పడకల ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేసుకోవడానికి నిధులు కేటాయించారన్నారు. ఆస్పత్రి నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. గర్భిణీ స్త్రీలకు ప్రొటీన్లతో కూడిన 14 రకాల బలవర్ధకమైన ఆహారాన్ని అంగన్ వాడీ సెంటర్ల ద్వారా అందించేందుకు ఆరోగ్య లక్ష్మి అనే పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఘనంగా ప్రారంభించారన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బస్తీ దవాఖానాల పేరిట మేజర్ గ్రామీణ ప్రాంతాల్లో కోట్ల రూపాయలతో పేదలకు ఆరోగ్యాన్ని అందించాలనే ఉద్దేశంతో కేసీఆర్ పకడ్బందీగా పథకాన్ని అమలు పరుస్తున్నారని, అందులో భాగంగానే ఎల్లారెడ్డి చుట్టుపక్కల గ్రామాల్లో బస్తీ దవఖానాల పేరిట భవన నిర్మాణాలు పూర్తి చేసినట్లు, త్వరలోనే వాటిని ప్రారంభిస్తామన్నారు. ప్రతి బస్తీ దవాఖానలో డాక్టర్, నర్సులు, సిబ్బంది ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి పురపాలక చైర్మన్ కుడుముల సత్యనారాయణ, ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కాశి నారాయణ, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు జలంధర్ రెడ్డి, జడ్పీటీసీ ఉషా గౌడ్, నాయకులు బాల్ రాజ్ గౌడ్, ఆసుపత్రి సూపరింటెండెంట్ రవీంద్ర మోహన్, ఎల్ డీసీ లక్ష్మన్, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Next Story

Most Viewed