కేసిఆర్ నాయకత్వమే దేశానికి శ్రీరామ రక్ష.. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

by Disha Web Desk 20 |
కేసిఆర్ నాయకత్వమే దేశానికి శ్రీరామ రక్ష.. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఉద్యమ నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో ఉప ప్రాంతీయ పార్టీగా మొదలైన టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం గాంధేయ మార్గంలో రాష్ట్రాన్ని సాధించుకుని అతి పెద్ద ప్రాంతీయ పార్టీగా అవతరించిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జాతీయ పార్టీ బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా ఆయన బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమ నేత కేసీఆర్ నాయకత్వంలో అధికారంలోకి వచ్చి తెచ్చుకున్న కొత్త రాష్ట్రం అనతి కాలంలోనే దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రజా, రైతు సంక్షేమ పరిపాలన యావత్ దేశం ఆసక్తిగా గమనిస్తోందన్నారు. రైతులు, పేదలు రెండు కళ్ళుగా పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని యావత్ భారతావని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. రైతుబంధు, రైతు భీమా, 24గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్, ఆసరా పెన్షన్లు, దళిత బంధు, సబ్బండ వర్గాల సంక్షేమం లాంటి ఎన్నో సంస్కరణల పథకాలతో తెలంగాణను అభివృద్ధిలో పరుగులు పెట్టించిన కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే మా ప్రాంతంలో కూడా తెలంగాణ లాంటి అభివృద్ది జరుగుతుందని వివిధ రాష్ట్రాల ప్రజలు బహిరంగంగానే తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ కేసీఆర్ ని ఆహ్వానిస్తున్నారు.

లౌకిక దేశాన్ని మత విద్వేశంతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ వైఖరి పట్ల, బీజేపీ మోడీ పాలన పట్ల దేశప్రజలు విసుగు చెందారన్నారు. బీజేపీ ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ, నిత్యావసరాల ధరలు పెంచుతూ, ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అన్ని వర్గాల దేశ ప్రజల నడ్డి విరుస్తున్నారన్నారు. యావత్ దేశాన్ని అధోగతి పాలుజేసింది బీజేపీ పాలన.

దీన్ని క్షుణ్ణంగా గమనించిన ప్రజలు రానున్న రోజుల్లో గాంధేయ మార్గంలో నడిచే కేసీఆర్ లాంటి నాయకుడు, తెలంగాణ మోడల్ అభివృద్ది పాలన కావాలని బలంగా కోరుకుంటున్నారు. యావత్ దేశ ప్రజల కోరిక మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ "భారత్ రాష్ట్ర సమితి" తో దేశ రాజకీయాల్లోకి రావడం హర్షణీయం. మా తండ్రి, రైతు నాయకుడు స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డితో కలిసి టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా నేడు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ సైనికుడిగా పని చేసే అవకాశం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్న.

కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన తర్వాత దేశ వ్యాప్తంగా ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. దేశ ప్రజల ఆదరాభిమానాలు, మద్దతు కేసీఆర్ ఉంటుందని కచ్చితంగా బీఆర్ఎస్ దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది అన్నారు. భారత దేశ దిశా దశ మార్చే సత్తా కేవలం కేసీఆర్ తో మాత్రమే సాధ్యం అవుతుంది. దేశానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష ఆని అన్నారు.


Next Story

Most Viewed