'మోడీకి తెలంగాణ ఆడపడుచుల ఉసురు తగులుతుంది'

by Disha Web Desk 20 |
మోడీకి తెలంగాణ ఆడపడుచుల ఉసురు తగులుతుంది
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : "దేశంలో మోడీ అవినీతి పాలనను కేసీఆర్ ప్రశ్నిస్తున్నందునే ఆయన్ను ఢీకొనే సత్తాలేక వారి కుమార్తె ఎమ్మెల్సి కవితమ్మను ఆడబిడ్డ అని కూడా చూడకుండా ఈడీ నోటీసుల పేరిట వేధిస్తున్నారని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అరోపించారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటిస్ లు జారీ చేయడం పై మంత్రి వేముల మోడి ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు. ఇది నీచాతినీచమైన రాజకీయ కుట్ర, యావత్ దేశప్రజల గొంతుకై ప్రశ్నిస్తున్న కేసీఆర్ పై కేంద్ర బీజేపీ మోడీ రాజకీయ కక్షసాధింపు చర్యలో భాగమే. ఇవన్ని కేసీఆర్ బిడ్డను ఇబ్బంది పాలు చేసి కేసీఆర్ మనోధైర్యాన్ని దెబ్బతీయాలని దురాలోచన చేస్తున్నది మోడీ సర్కార్ కానీ ఎన్నికుట్రలు చేసినా కేసీఆర్ తలొగ్గరు. ఇట్లాంటి ఊకదంపుడు బెదిరింపులకు భయపడితే తెలంగాణ రాష్ట్రం సాధించేవాడే కాదు.

మేమంతా కేసీఆర్ కుటుంబ సభ్యులమే ఎన్నికేసులు పెడతారో పెట్టుకోండి మేం బెదిరే ప్రసక్తే లేదు. తెలంగాణ ఉద్యమ బిడ్డలకు అరెస్టులు, జైళ్లు కొత్తేమీ కాదు. బరాబర్ నరేంద్ర మోడీ అవినీతి పాలనను ప్రజల్లో ఎండగడతాం. బీజేపీ మోడీ, అమిత్ షా ఎట్లా చెప్తే అట్లా వ్యవహరిస్తున్నాయి రాజ్యాంగబద్ధ సంస్థలు. ఈడీ, సీబీఐ బీజేపీకి తోబుట్టువులా పనిచేస్తున్నాయి. లక్షల కోట్ల దేశ సంపదను కొల్లగొడుతున్న మోడీ దోస్త్ అదానీ పై ఎలాంటి చర్యలు లేవు. మోడీ బినామీ అదానీ ఎల్ఐసీ, ఎస్బీఐలలో ప్రజలు దాచుకున్న సొమ్మును దోచుకున్నాడు. ఇందులో వేలకోట్ల కుంభ కోణం జరిగింది. దమ్ముంటే దానిపై ఈడీ, సీబీఐ కేసులు పెట్టి దర్యాప్తు జరపాలి. దేశ ప్రజలను అన్నివిధాలా ఇబ్బందులకు గురిచేస్తున్న బీజేపీ మోడీ గద్దె దిగేవరకు మా పోరాటం ఆగదన్నారు. ఆడబిడ్డను అడ్డం పెట్టుకొని రాజకీయ కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతున్న బీజేపీ మోడీకి తెలంగాణ ఆడపడుచుల ఉసురు తగులుతుంది." అని వ్యాఖ్యానించారు.


Next Story

Most Viewed