తెలంగాణకు భవిష్యత్తు ముఖ్యమంత్రి కేటీఆర్ : స్పీకర్ పోచారం

by Disha Web Desk 1 |
తెలంగాణకు భవిష్యత్తు ముఖ్యమంత్రి కేటీఆర్ : స్పీకర్ పోచారం
X

దిశ, బాన్సువాడ : తెలంగాణ భవిష్యత్తు ముఖ్యమంత్రి కేటీఆరేనని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా బుధవారం నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండలం సిద్దాపూర్ రిజర్వాయర్ వద్ద జరిగిన "సాగునీటి దినోత్సవం" కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సభలో మాట్లాడుతూ.. ప్రతి అవసరాలకు నీరు అవసరమని, భూమి, విత్తనం అందుబాటులో ఉన్నా, రైతులు కష్టపడినా పంటలు పండడానికి కావలసినది నీరేనని అన్నారు.

గతంలో వానాకాలం పంటలు వర్షాలపై ఆధారపడితే, యాసంగిలో భూగర్భ జలాలు తగ్గి పంటలు ఎండిపోయేవని, నీరు లేకపోతే పంటలు పండవన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రెండు పెద్ద నదులు కృష్ణ, గోదావరి ఉన్నాయని, కాని మన ప్రాంత భూములు ఆ నదుల కంటే 600 మీ. ఎత్తులో ఉన్నాయన్నారు. మన ప్రాంతాల భూములకు నీళ్లు ఇవ్వాలంటే ఎత్తిపోతల పథకాలే మార్గమని, అందుకే తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తలో సీఎం అందరినీ కూర్చొబెట్టి, అందరి సలహాలు తీసుకుని ఇంజనీర్లను వెంటబెట్టుకుని రాష్ట్రం మొత్తం హెలికాప్టర్ లో తిరిగి సమగ్రంగా వివరాలను రూపొందించారని తెలిపారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టు అలాగే రూపుదిద్దుకుందన్నారు. కేవలం మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని సీఎం అంటే మాకు ఆశ్చర్యం వేసిందని, ఆయన శ్రమ, పట్టుదల, కృషి, చిత్తశుద్ధితో ముప్పై సంవత్సరాల్లో పూర్తయ్యే ప్రాజెక్టును కేవలం మూడేళ్లలో పూర్తి చేశారని తెలపారు. మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజీలు పూర్తయ్యాయని, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లు పూర్తయ్యాయన్నారు. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 13 జిల్లాల్లో 50 నియోజకవర్గాల్లోని 170 మండలాల పరిధిలోని 50 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతోందన్నారు.

కామారెడ్డి జిల్లాకు సాగునీరు అందించే 22వ ప్యాకేజీ పూర్తి కావచ్చిందని, 2004 నుంచి 2014 వరకు నీటి పారుదల రంగంలో ఖర్చు చేసిన మొత్తం రూ.54 వేల కోట్లు అని అన్నారు. తెలంగాణ వచ్చిన 2014 నుంచి 2022 వరకు సాగునీటి రంగంపై చేసిన ఖర్చు రూ.1.70 లక్షల కోట్లు అని, 2004 నుంచి 2014 వరకు నీటి వసతి కల్పించిన కొత్త ఆయకట్టు 5,70,000 ఎకరాలు, స్థిరీకరణ 93,000 ఎకరాలన్నారు. మన ప్రభుత్వం ద్వారా ఎనమిదేళ్లలో వచ్చిన కొత్త ఆయకట్టు 17,23,000 ఎకరాలు, స్థిరీకరణ 30,57,000 ఎకరాలని, అంటే మొత్తం 50 లక్షల ఎకరాలకు పుష్కలంగా సాగునీరు అందుతుందన్నారు.

మిషన్ కాకతీయ పథకం ద్వారా 22,000 చెరువులు బాగు చేసుకున్నామని తెలపారు. వీటి ద్వారా 15 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని, ఎంత తేడా ఉందో ప్రజలు గమనించాలన్నారు. గతంలో కాంగ్రెస్ నాయకులు నీళ్లు లేని చోట కాలువలు తవ్వి కాంట్రాక్టర్ల జేబులు నింపారని, వాళ్లు ప్రాజెక్టులు కట్టే ప్రదేశంలో నీళ్లు లేవన్నారు. రాష్ట్రంలో 2014 లో 1.08 కోట్ల ఎకరాల సాగు భూమి ఉంటే నేడు 1.10 కోట్ల ఎకరాలు పెరిగి మొత్తం 2.18 కోట్ల ఎకరాలకు పెరిగిందన్నారు. సాగునీటి వనరుల నిర్మాణంతో ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా రైతులకు ఇబ్బందులు ఉండవని, పంటలు పండుతాయన్నారు.

దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా తెలంగాణ లోని కేసీఆర్ గారి లాంటి పరిపాలన కావాలని కోరుకుంటున్నార పేర్కొన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో మొత్తం 1.50 లక్షల ఎకరాల సాగు భూములున్నాయని, ఇందులో లక్ష ఎకరాలు నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలో, మరో 25,000 ఎకరాలు చెరువులు, బోర్లు, మంజీర నది వెంట సాగులో ఉందన్నారు. మిగిలిన 25,000 ఎకరాల మెట్ట ప్రాంత భూములకు సాగునీరు అందించడానికి సిద్దాపూర్ రిజర్వాయర్, జాకోర-చందూరు- చింతకుంట ఎత్తిపోతల పథకాలను నిర్మిస్తున్నామని తెలిపారు.

సిద్దాపూర్ రిజర్వాయర్, జాకోర-చందూరు-చింతకుంట ఎత్తిపోతల పథకాల ఖర్చు రూ.350 కోట్లు, మొత్తం 25,000 ఎకరాల భూమి సాగవుతోందన్నారు. సిద్దాపూర్ రిజర్వాయర్ తో మూడు మండలాలలోని మెట్ట ప్రాంతాల భూములకు సాగునీరందుతోందని అన్నారు. ఈ రిజర్వాయర్ కు అవసరమైన 570 ఎకరాల అటవీ శాఖ భూమి బదలాయింపు జరుగుతోందన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో మంజీర నదిపై మొత్తం నాలుగు చెక్ డ్యాంలు నిర్మించడానికి ప్రణాళికలు రూపొందించామని, ఇప్పటికే పూర్తయిన బాన్సువాడ చెక్ డ్యాం నిర్మాణంతో ఆరు కిలోమీటర్ల పరిధిలో నీళ్లు ఆగాయన్నారు.

చుట్టూ పక్కల ప్రాంతాలలో పుష్కలంగా భూగర్భ జలాలు పెరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు రాజీవ్ గాంధీ హన్మంతు, జితేష్ వి.పాటిల్, నిజామాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్, జిల్లా రైతుబంధు అధ్యక్షుడు అంజిరెడ్డి, ఆర్డివో రాజగౌడ్, సాగునీటి శాఖ సీఈ శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed