నిరుద్యోగులను మోసం చేసిన కేసీఆర్ సర్కార్ : టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్

by Disha Web Desk 1 |
నిరుద్యోగులను మోసం చేసిన కేసీఆర్ సర్కార్ : టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్
X

దిశ, బ్యూరో సంగారెడ్డి : నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో గద్దెనెక్కిన కేసీఆర్ సర్కార్ నిరుద్యోగులను మోసం చేసిందని, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కల్లబొల్లి మాటలు చెప్పిందంటూ టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ మెదక్ పార్లమెంట్ ఇన్ చార్జి గాలి అనిల్ కుమార్ ఆరోపించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యార్థి, నిరుద్యోగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 8న హైదరాబాద్ సరూర్ నగర్ లో నిర్వహించ తలపెట్టిన ‘నిరుద్యోగ జంగ్ సైరన్’ సభను జయప్రదం చేయాలని యువతకు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

గత ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ ఇచ్చిన హామీలకు, కొనసాగిస్తున్న పాలనకు ఏ మాత్రం సంబంధం లేదంటూ ఎద్దేవా చేశారు. స్వయంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారమే నిరుద్యోగులకు 51 నెలలుగా నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉందన్నారు. ఈ లెక్కన ఒక్కో నిరుద్యోగికి సర్కారు రూ.1.60 లక్షలు బాకీ పడిందని ఆరోపించారు. ఆ బాకీని బేరషతుగా చెల్లించాలని అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో.. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, భారత్ జోడో యాత్రకు అనుబంధంగా వరుస నిరసనలు చేపడుతున్నామని తెలయజేశారు. ఇందులో భాగంగానే సరూర్ నగర్ లో నిరుద్యోగ జంగ్ సైరన్ నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ఈ బహిరంగ సభకు ప్రియాంకగాంధీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని తెలిపారు. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత, పార్టీ కార్యకర్తలు నిరుద్యోగ జంగ్ సైరన్ కు అత్యధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని లేని పక్షంలో నిరుద్యోగులే సీఎం కేసీఆర్ సర్కారును గద్దె దింపుతారని అనిల్ కుమార్ హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని.. ఇక అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత తప్పదని జోస్యం చెప్పారు.


Next Story

Most Viewed