కాళేశ్వరం జల సింగారం.. తెలంగాణ కొంగు బంగారం

by velandi.Saikiran |

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ప్రపంచమే అబ్బురపడేలా లక్షల

కాళేశ్వరం జల సింగారం.. తెలంగాణ కొంగు బంగారం
X

దిశ, ఆర్మూర్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ప్రపంచమే అబ్బురపడేలా లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చాడ‌ని....కానీ ఆ జల స్ఫూర్తికి కాంగ్రెస్ ప్రభుత్వం అపకీర్తి తెస్తోందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని నీలాపనిందలు వేసి కేసీఆర్ పై సీబీఐ విచారణ కోరడం రాష్ట్ర ఆత్మగౌరవానికే తలవంపు అని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు.

కాళేశ్వరం జల సింగారం తెలంగాణ కొంగు బంగారమని ఆయన అభివర్ణించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీ లు సృష్టించిన అపోహలను అనేక వేదికల ద్వారా తొలగించినా అదేపనిగా విషం కక్కు తున్నారని జీవన్ రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదని అర్థమై తాజాగా సీబీఐ విచారణ అంటూ సరికొత్త మోసానికి తెరదీశారని ఆయన ఎద్దేవా చేశారు. ఆది నుంచి తెలంగాణ విలన్ పాత్ర పోషించిన కాంగ్రెస్ నేతలు కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పాలన చూసి కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. కేసీఆర్ జోలికొస్తే తెలంగాణ ప్రజలు తిరగబడుతారు అని హెచ్చరించారు. కాంగ్రెస్ కుట్ర రాజకీయాలను ఎదుర్కోవ డానికి ప్రజలతో కలిసి మహాయుద్ధం చేయడానికి గులాబీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

Next Story