మోదీ హయాంలోనే కేంద్రీయ విద్యాలయాల అభివృద్ధి : బీజేపీ రాష్ట్ర ఇన్ చార్జి సునీల్ బన్సల్

by Disha Web Desk 1 |
మోదీ హయాంలోనే కేంద్రీయ విద్యాలయాల అభివృద్ధి : బీజేపీ రాష్ట్ర ఇన్ చార్జి సునీల్ బన్సల్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : దేశ ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రూ.21 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న నిజామాబాద్ నగరంలోని కేంద్రీయ విద్యాలయ భవనానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఇన్ చార్జి సునీల్ బన్సల్, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారికి కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు, విద్యార్థులు, తల్లిదండ్రులు స్వాగతం పలికారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి , రాష్ట్ర ఇన్ చార్జి సునీల్ బన్సల్ మాట్లాడుతూ గత తొమ్మిదేళ్ల కాలంలో మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందన్నారు. మోధీ ప్రభుత్వం ఐఐటీలు, యూనివర్సిటీలు, రోడ్ల నిర్మాణాలకు పెద్దపీట వేస్తుందన్నారు. అనంతరం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి మాట్లాడుతూ.. నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.22 కోట్లు మంజూరు చేసిందన్నారు. కేంద్రం నిధులు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇవ్వట్లేదన్నారు. భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మొదట నిర్మాణానికి 10 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని, కానీ పైప్ లైన్లు ఉన్నాయని సాకులు చూపుతూ, రూ.2 కోట్ల రూపాయలు పాఠశాలనే అడగడం విడ్డూరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించినట్లే కేటాయించి లాక్కోవడం అన్యాయం అన్నారు. వెయ్యి మంది వరకు చదువుకునే విద్యార్థుల కోసం రూ.2కోట్లు కూడా కేటాయించకపోవడం విడ్డూరమన్నారు. ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా భాజపా కార్పొరేటర్లను కొంటున్నారని, వాటిపై ఉన్న శ్రద్ధ విద్యాలయాల పట్ల ఉంచాలన్నారు. నెల రోజుల్లో మిగిలిన భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలని, త్వరలోనే భవన నిర్మాణాన్ని ప్రారంభిస్తామన్నారు.

బోధన్ కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణానికి కూడా రూ.22 కోట్ల నిధులు మంజూరయ్యాయని, పనులు వేగంగా నడుస్తున్నాయన్నారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాలో నవోదయ పాఠశాలల ఏర్పాటు మంజూరయ్య దశలో ఉందని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. భవనాన్ని త్వరితగతిన ప్రారంభించాలని, ఖాళీ పోస్టులు త్వరగా పార్టీ చేయాలని కోరగా ఎంపీ సానుకూలంగా స్పందించారు. అనంతరం కేంద్రీయ విద్యాలయం నుంచి జాతీయ స్థాయి హాకీ పోటీలకు పాల్గొన్న విద్యార్థులకు అభినందనలు తెలియజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, పార్లమెంట్ ఇన్ చార్జి వెంకటరమణి, పాపారావు, ధన్ పాల్ సూర్యనారాయణ, దినేష్ కులాచారి, మేడపాటి ప్రకాశ్ రెడ్డి, మోహన్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, స్రవంతి రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed