పెర్కిట్ విద్యుత్ లైన్ మెన్ కు ప్రమాదం..

by Disha Web Desk 20 |
పెర్కిట్ విద్యుత్ లైన్ మెన్ కు ప్రమాదం..
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ విద్యుత్ లైన్ మెన్ మంగళ్ చంద్ రాథోడ్ కు ప్రమాదం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ లో గల శ్రీ వెంకటేశ్వర గార్డెన్ ఏసీ ఫంక్షన్ హాల్ లో హోలీ పర్వదినం రోజున ట్రాన్స్ ఫార్మర్ ఫీజులు పోయాయి. ట్రాన్స్ ఫార్మర్ ఫీజులు వేసేందుకు విద్యుత్ లైన్ మెన్ ట్రాన్స్ ఫార్మర్ ఏబీ స్విచ్ ఆఫ్ చేసి, సబ్ స్టేషన్ ఎల్ సీ సైతం తీసుకున్నాడు. హోలీ పర్వదినానికి ముందు రోజు రాత్రి ఈదురు గాలులతో విద్యుత్ సరఫరాలో విద్యుత్ సిబ్బందికి రాత్రి నిద్రలేకుండా సర్దుబాట్లు చేయాల్సివచ్చింది. ఈ క్రమంలోనే విద్యుత్ లైన్మెన్ మంగళ్ చంద్ రాథోడ్ తీవ్రమైన పనిఒత్తిడి, ఫ్రస్టేషన్లో సబ్ స్టేషన్ ఎల్ సీ తీసుకుని ట్రాన్స్ ఫార్మర్ ఫీజులు వేసేందుకు రెడీ అయ్యాడు.

కానీ ట్రాన్స్ ఫార్మర్ ఏబి స్విచ్ ఆఫ్ పనిచేయక, సబ్ స్టేషన్ ఎల్ సీ సైతం పొరపాటుగా వేరే పిడర్ కు తీసుకున్నాడు. ఈ ట్రాన్స్ ఫార్మర్ ఫీడర్ ను ఆరునెలల క్రితమే సదరు ఫంక్షన్ హాల్ యజమానులు నరహరి-లలిత దంపతులు డీడీ తీయించి మార్చారు. ఈ ఫీడర్ మార్చిన విషయాన్ని మరిచి విద్యుత్ లైన్ మెన్ పొరపాటుగా వేరే ఫీడర్ ఎల్ సి తీసుకొని ట్రాన్స్ ఫార్మర్ ఫీజులు వేసేందుకు పైకి ఎక్కాడు. దీంతో ట్రాన్స్ ఫార్మర్ ఏబీ స్విచ్ ఆఫ్ పనిచేయక, సబ్ స్టేషన్ ఎల్ సి ఫీడర్ పొరపాటుగా తీసుకోవడం వల్ల ఫీజులు మార్చేందుకు ట్రాన్స్ ఫార్మర్ ఎక్కిన విద్యుత్ లైన్ మెన్ మంగళ్ చందు రాథోడ్ ఒక్కసారి విద్యుత్ షాక్ కు గురై.. అక్కడి నుంచి కింద పడి తీవ్ర ప్రమాదానికి గురయ్యాడు. క్రింద పడ్డ సమయంలో విద్యుత్ లైన్ మెన్ మంగళ్ చంద్ రాథోడ్ కు మెడవెనుక భాగంలో వెన్నుపూసకు గాయమైంది.

దీంతో సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో గత 20 రోజులుగా మంచానికి పరిమితమై చికిత్స పొందుతున్నాడు. యశోద ఆసుపత్రిలో మాత్రం ఎన్పీడీసీఎల్ సంస్థ ద్వారానే సదరు విద్యుత్ లైన్ మెన్ కు చికిత్సను అందిస్తున్నారు. కేవలం గత మూడురోజుల నుండి బంజారాహిల్స్ లోని వెల్ నాక్స్ రియాబిలేషన్ సెంటర్ లో ఫిజియోథెరపీ చికిత్స అందించడానికి సుమారు లక్ష వరకు బిల్ అయిందని ఆర్మూర్ విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. పెరికిట్ లోని వెంకటేశ్వర గార్డెన్ ఏసీ ఫంక్షన్ హాల్లో ట్రాన్స్ ఫార్మర్ ఫీజులు వేసేందుకు వెళ్లి ప్రమాదానికి గురైన విద్యుత్ లైన్మెన్ కు మరో రెండు నెలల పాటు మంచానికే పరిమితమై ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందని యశోద ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. సదురు లైన్ మెన్ కు ఆ ఫంక్షన్ హాల్ యజమానులు వైద్య చికిత్స అందించడంలో ఆర్థిక సాయం అందించి మానవత్వాన్ని వారు చాటుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్మూర్ పట్టణంలో పలువురు ప్రముఖులు చెబుతున్నారు.


Next Story