నందిపేట్ లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడి దాష్టీకం

by Disha Web Desk 1 |
నందిపేట్ లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడి దాష్టీకం
X

బీటెక్ విద్యార్థి, మరో యువకుడిపై దాడి

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నందిపేట్ మండల కేంద్రంలో ఇద్దరు యువకులపై మంగళవారం బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అకారణంగా దాడి చేశాడు. ఈ ఘటనలో బీటెక్ చదువుతున్న విద్యార్థితో పాటు ఐటీ ఉద్యోగం చేస్తున్న యువకుడు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. నందిపేట్ మండల కేంద్రంలో డొంకేశ్వర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి, అతడి బావ ఐన మరో యువకుడు టిఫిన్ సెంటర్ కు వెళ్లి టిఫిన్ చేసేందుకు ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో నందిపేట్ మండలానికి చెందిన బీఆర్ఎస్ నేత టిఫిన్ చేసి చేతులు కడుగుతుండగా ఎంగిలి నీళ్లు పడడంతో.. బీటెక్ విద్యార్థి చూసుకుని చేతులు కడగాలని సూచించాడు.

దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన బీఆర్ఎస్ పార్టీ నేత విద్యార్థిపై అతనితో పాటు ఉన్న అతని బావపై దాడి చేశారు. బీఆర్ఎస్ లీడర్ తో పాటు ఉన్న అనుచరులు కూడా ఇద్దరిని చితకబాదారు. తీవ్రంగా గాయపడిన వారు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేసుకునేందుకు వెళ్లగా అక్కడ కూడా ఇద్దరిని బయటకు లాటి తీవ్రంగా కొట్టారు. ఈ మేరకు బాధితులు సోమవారం రాత్రి నందిపేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎం.ఎన్.సీ తీసుకువస్తే కేసు నమోదు చేస్తామని తెలిపినట్లు బాధితులు తెలిపారు. బీఆర్ఎస్ మండల పార్టీ నేత చేసిన దౌర్జన్యంపై ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఫిర్యాదు చేస్తామని బాధితులు తెలిపారు.

Next Story