మహిళల భద్రతా చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి..

by Disha Web Desk 20 |
మహిళల భద్రతా చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : మహిళల భద్రతా కోసం ఉద్దేశించిన చట్టాల గురించి అవగాహనను పెంపొందించుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వి.సునీత లక్ష్మారెడ్డి సూచించారు. అప్పుడే మహిళలు తమకు అన్యాయం జరిగిన సందర్భాల్లో తగిన న్యాయం పొందవచ్చని హితవు పలికారు. మహిళల హక్కుల పరిరక్షణకు, వారి జీవన స్థితిగతులను మెరుగుపర్చేందుకు మహిళా కమిషన్ నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. చైర్ పర్సన్ నేతృత్వంలో సభ్యులు షాహీన్, రేవతి, సూదం లక్ష్మీ, పద్మ, ఈశ్వరీ బాయి, ఉమాదేవిలతో కూడిన రాష్ట్ర మహిళా కమిషన్ బృందం సోమవారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అన్ని శాఖల జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం, సెమినార్ నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ ఆకుల లలిత, నగర మేయర్ దండు నీతూకిరణ్, అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్ తదితరులు సెమినార్ లో పాల్గొన్నారు. న్యాయ సేవాధికార సంస్థ ద్వారా, వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మహిళలు, బాలికల భద్రత, సంక్షేమం, అభివృద్ధి కోసం అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి సంబంధిత శాఖల అధికారులు సెమినార్లో వివరించారు.

ఈ సందర్భంగా మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మహిళల సమస్యల పరిష్కారానికి కమిషన్ ద్వారా చేస్తున్న కృషి గురించి వివరించారు. మహిళల హక్కులకు భంగం కలిగినప్పుడు బాధితులకు తగిన న్యాయం చేస్తూ, వారికి అండగా నిలుస్తున్నామని అన్నారు. రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులను వినియోగించుకుంటూ నేటి సమాజంలో బాలికలు, యువతులు ఉన్నత చదువులు అభ్యసిస్తూ అన్ని రంగాల్లో పురుషులకు సమానంగా రాణిస్తున్నారని అన్నారు. అయినప్పటికీ ఇంకనూ అక్కడక్కడ మహిళల పట్ల వివక్షతతో కూడిన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వెలిబుచ్చారు. మహిళల రక్షణ, భద్రత కోసం రూపొందించబడిన చట్టాలపై, రాజ్యాంగం ద్వారా కల్పించబడిన హక్కుల గురించి పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలని సూచించారు. ఆడ, మగ, పేద, ధనిక, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా రాజ్యాంగం పౌరులందరికీ సమాన హక్కులు కల్పించిందన్నారు. అయినప్పటికీ మహిళపై జరిగే దాడులు, దౌర్జన్యాలు, అఘాయిత్యాలను నిరోధించేందుకు ప్రభుత్వాలు మహిళల కోసం ప్రత్యేక చట్టాలు అమలు చేస్తున్నాయని అన్నారు. వీటి గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల అనేకమంది బాధితులు తమకు జరిగిన అన్యాయాల గురించి బయటకు చెప్పుకోలేక మిన్నకుండిపోతున్నారని అన్నారు.

ఈ పరిస్థితిలో మార్పు తేవాలని, మహిళా చట్టాల పట్ల అవగాహన కల్పిస్తూ చైతన్యం పెంపొందించాలని కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. మహిళల చట్టాల పట్ల మహిళలు, బాలికలకు కాకుండా పురుషులకు కూడా అవగాహన కల్పించినప్పుడే సరైన ఫలితాలు వస్తాయని అన్నారు. కళాశాలల వద్ద షీ టీం లతో నిఘా ఏర్పాటు చేయాలని, యాంటీ ర్యాగింగ్ కమిటీలను నెలకొల్పాలని సంబంధిత అధికారులకు సూచించారు. వివాహాల రిజిస్ట్రేషన్ చట్టాన్ని ప్రతి ఒక్కరు తప్పనిసరి పాటించేలా చూడాలని, దీనివల్ల విదేశాలకు వెళ్లిన సమయాల్లోనూ ఏవైనా వేధింపులు, అన్యాయాలు ఎదురైతే రక్షణ పొందేందుకు ఆస్కారం ఉంటుందని చైర్ పర్సన్ హితవు పలికారు. భ్రూణ హత్యల నిరోధక చట్టం, పోక్సో యాక్ట్, గృహ హింస వంటి చట్టాలను ఆకళింపు చేసుకోవాలని, ఏ సమస్య ఎదురైనా ఆత్మస్థైర్యం కోల్పోకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. వరకట్న హత్యలు, అత్యాచార సంఘటనల్లో బాధితులకు పరిహారం అందేలా సంబంధిత అధికారులు చొరవ చూపాలన్నారు.

బాలికల అభ్యున్నతి, విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. ఏ సమస్య ఉన్నా మహిళలు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇ-మెయిల్ ద్వారానే కాకుండా వాట్స్ యాప్ నెంబర్. 9490555533 ద్వారా కమిషన్ కు ఫిర్యాదు చేయవచ్చని చైర్ పర్సన్ సూచించారు. హెల్ప్ లైన్ నెంబర్- 181 ద్వారా కూడా సహాయం పొందవచ్చని అన్నారు. వీటి గురించి విస్తృత ప్రచారం నిర్వహిస్తూ, ఉమ్మడి కార్యాలయాల సముదాయం, ఇతర జన సంచారం ఉండే ప్రదేశాల్లో హోర్డింగులు ఏర్పాటు చేయించాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు.

ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ డైరెక్టర్ శారద, జిల్లా కమిటీ చైర్ పర్సన్ నీరజారెడ్డి, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారిణి సుధారాణి, అన్ని శాఖల అధికారులతో పాటు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని బాలసదన్ శిశు గృహం, సఖి సెంటర్, స్వధర్ హోం లను మహిళా కమిషన్ బృందం సందర్శించింది. వసతి పొందుతున్న చిన్నారుల బాగోగుల గురించి ఆరా తీశారు. వారికి అందిస్తున్న భోజనంకు సంబంధించిన మెనూ పరిశీలించి పలు సూచనలు చేశారు. వంటగది, స్టోర్ రూమ్లను తనిఖీ చేశారు. చిన్నారులను ఆప్యాయంగా పలకరిస్తూ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి చాక్లెట్లను పంచిపెట్టారు.



Next Story